నేషనల్ క్రష్ రష్మిక కి నేషనల్ లెవెల్ లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని శ్రీవల్లి పాత్రలో ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం అన్నీ సరికొత్తగా ఉండి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప.. ది రూల్’లోనూ శ్రీవల్లి పాత్ర ఎంతో ప్రధానంగా ఉండబోతుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ‘పుష్ప 2’ని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్. రెండు, మూడు యూనిట్లతో షూటింగ్ లో వేగం పెంచాడు. ఈకోవలోనే నంద్యాల సమీపంలోని యాగంటి ఆలయం దగ్గర రష్మిక పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
అలాగే.. ఈ సినిమా షూటింగ్ విశేషాలను తన ఇన్ స్టా స్టోరీస్ లోనూ పంచుకుంది రష్మిక. ‘ఇవాళ ఈ దేవాలయంలో మూవీ చిత్రీకరణ జరిగింది. యాగంటి అని పిలవబడే ఈ ఆలయ స్థల పురాణం నిజంగా చాలా అద్భుతం. ఇక్కడి ప్రజలు, వారి ప్రేమ మాటల్లో చెప్పలేం. ఈ రోజు చాలా అద్భుతంగా గడిచింది’ అని చెప్పింది.