ఒకవైపు నిర్మాణం.. మరోవైపు పంపిణీ.. మైత్రీ అదరహో!

మైత్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్ లో ఒన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్‌ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. 2015, ఆగస్ట్ 7న విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రంతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించింది మైత్రీ మూవీ మేకర్స్. నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన రెండు మూడేళ్లలోనే అగ్ర సంస్థగా అవతరించింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నిర్మాణ రంగంలో తమకు తిరుగులేదనిపిస్తూ సాగుతుంది. కేవలం ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే పాతిక సినిమాల వరకూ ప్రేక్షకుల ముందు నిలిపిన మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు డజను చిత్రాలను పైప్ లైన్లో పెట్టింది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రాబోయే సినిమాల లిస్ట్ చూస్తుంటే మతి పోవాల్సిందే. టాలీవుడ్ టు బాలీవుడ్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ మైత్రీ కిట్టీలో ఉన్నాయి.

తెలుగులో అల్లు అర్జున్ తో ‘పుష్ప 2’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమాని అనౌన్స్ చేసింది. ‘రంగస్థలం’ తర్వాత చరణ్-సుక్కూ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్.. చరణ్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఇప్పటికే ‘జనతాగ్యారేజ్’ వంటి సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో తారక్ తో సినిమాని ప్లాన్ చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ టైమ్ మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తుంది మైత్రీ సంస్థ. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రిలీజైన స్పెషల్ గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో మైత్రీ సంస్థ ఇప్పటివరకూ పనిచేయని మరో హీరో ప్రభాస్. ఇప్పుడు రెబెల్ స్టార్ తోనూ ఒక సినిమాని లైన్లో పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పీరియడ్ సబ్జెక్ట్ కు సంబంధించి కొన్ని పాటలు కూడా రెడీ చేశాడట డైరెక్టర్ హను రాఘవపూడి. తెలుగులో ఇంకా.. విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాన్, నితిన్ ‘రాబిన్ హుడ్’, ఫణీంద్ర నార్సెట్టి ‘8 వసంతాలు’ వంటి సినిమాలు మైత్రీ ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ‘

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బడా మూవీస్ ను లైన్లో పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్.. తమిళంలోనూ అల్టిమేట్ స్టార్ అజిత్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాని నిర్మిస్తుంది. మరోవైపు మలయాళంలో టోవినో థామస్ తో ‘నడిగర్ తిలకమ్’, హిందీలో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఒక సినిమా మైత్రీ విష్ లిస్ట్ లో ఉన్నాయి.

మరోవైపు పంపిణీ రంగంలోనూ తమకు తిరుగులేదనిపిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. గత ఏడాది చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించడమే కాకుండా.. వాటిని నైజాంలో సొంతంగా విడుదల చేసి ఘన విజయాలు సాధించింది. ఇదే ఊపులో ప్రభాస్ ‘సలార్’ని నైజాం లో విడుదల చేసి భారీ లాభాలు మూటగట్టుకుంది. ఆ తర్వాత ‘హనుమాన్’తో మైత్రీ కి పండిన కాసుల పంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’, మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ను తెలుగులో పంపిణీ చేస్తుంది. మొత్తంమీద.. ఒకవైపు నిర్మాణం.. మరోవైపు పంపిణీ.. రెండు పడవలపై సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్.

Related Posts