బాలీవుడ్ ని ఏలిన అగ్ర నటుల్లో ధర్మేంద్ర ఒకరు. 70, 80 దశకాల్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ధర్మేంద్ర వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆయన కుమారులు సన్నీడియోల్, బాబీ డియోల్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సన్నీ, బాబీ ఇద్దరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.
‘గదర్ 2‘తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సన్నీ డియోల్.. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఇంకా.. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రామాయణ్‘లో హనుమాన్ గా అలరించబోతున్నాడు. బాబీ డియోల్ సంగతి చెక్కర్లేదు. ‘యానిమల్‘తో విలన్ గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన బాబీ డియోల్.. ప్రస్తుతం సౌత్ లో కొన్ని క్రేజీ మూవీస్ లో నటిస్తున్నాడు.
కొడుకులను చూసి గర్వపడుతున్న ధర్మేంద్ర.. కూతురు ఇషా డియోల్ విషయంలో మాత్రం బాధపడుతున్నాడట. ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని కూతురైన ఇషా డియోల్ ఇటీవలే భరత్ తక్తానీతో డివోర్స్ ని అనౌన్స్ చేసింది. ఈ వార్త తెలియగానే 88 ఏళ్ల ధర్మేంద్ర బాగా కృంగిపోయాడట. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించాలని ఇషా డియోల్, భరత్ ని కోరాడట. ఇషా డియోల్ బాలీవుడ్ తో పాటు.. సౌత్ లోనూ మణిరత్నం ‘యువ‘ సినిమాలో సూర్యకి జోడీగా నటించింది.