వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాల కన్నా.. తన కామెంట్స్ తో ఎక్కువుగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను మెగాస్టార్ చిరంజీవి, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ, రైటర్ అండ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి, నిర్మాత నిరంజన్ రెడ్డి కలవడం జరిగింది. సినిమా పరిశ్రమ సమస్యలను.. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్లను పెంచాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది.
అయితే.. పెద్ద సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని.. అలాగే సినిమా రంగం సమస్యలను పరిష్కరిస్తామని.. ఈ నెలాఖరులోపు కొత్త జీవో వస్తుందని.. సీఎం జగన్ తెలియచేశారని.. చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సీఎం జగన్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేశారు. అయితే… అందరిదీ ఒక దారి అయితే… వర్మది మరోదారి. నలుగురుకి నచ్చింది ఆయనకు అసలు నచ్చదు. అందుకనే.. ఏపీ ప్రభుత్వంతో తాజాగా సినీ ప్రముఖులు జరిపిన చర్చల పై దర్శకుడు రామ్గోపాల్ వర్మ చాలా వెటకారంగా స్పందించారు. సీఎం జగన్ను కలసిన టాలీవుడ్ హీరోలను టార్గెట్ గా చేసుకొని పరోక్షంగా చురకలు అంటించారు.
ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశానికి, చిత్ర పరిశ్రమ సమస్యల పైన సీఎం సానుకూలంగా స్పందించడానికి సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్ పనిచేసిందన్నారు. ఒమెగా స్టార్ జగన్ను ఆశీర్వదించినందుకు నాకు సంతోషంగా ఉంది. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్ అని ముఖ్యమంత్రికి కితాబునిచ్చారు రామ్గోపాల్ వర్మ. అంతకు ముందు మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ను చూసి చాలా హార్ట్ అయ్యాను అని ట్వీట్ చేసిన వర్మ వెంటనే దాన్ని తొలగించారు. అయితే.. సీఎంతో మీటింగ్కు వర్మను ఆహ్వానించకపోవడం వలనే ఆయన ఇలా వెటకారంగా ట్వీట్ చేసారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వర్మ కామెంట్స్ గురించి ఇండస్ట్రీ పెద్దలు స్పందిస్తారేమో చూడాలి.