రౌడీబాయ్స్ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్

ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాల సందడి మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలకు సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా వేశారు. సడెన్ గా వచ్చిన అవకాశం కాబట్టి వీరికి ప్రమోషన్స్ పరంగానూ టైమ్ తక్కువే. ఆ తక్కువలోనే ఎక్కువ ఇంప్రెషన్ వేసేందుకు ప్రయత్నిస్తూ.. రౌడీబాయ్స్ నుంచి లేటెస్ట్ గా ఓ బ్యూటీఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

రౌడీబాయ్స్ దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా.. సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే వాడేస్తున్నాడు దిల్ రాజు. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ఈ పాట చాలా బావుంది. సుద్దాల అశోక్ తేజ రాయగా.. మంగ్లీ పాడారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఒకే తరహా పాటలతో వస్తోన్న మంగ్లీకి ఈ పాట చాలా ఫ్రెష్ గా అనిపించి ఉండొచ్చు. అందుకే తనూ చాలా బాగా పాడింది.

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే.. యమునాతీరాన ఉన్న రాధను చూశాడే అంటూ సాగే ఈ గీతం వినగానే ఆకట్టుకునేలా ఉంది. విశేషం ఏంటంటే.. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వినిపించే పాటలా కనిపిస్తోంది. ఆ బ్యాక్ డ్రాప్ లో ఈ కాలంలో ఇలాంటి మెలోడియస్ సాంగ్ రావడం అరుదే. హీరోయిన్ కు హీరోపై ఉన్న ఇంప్రెషన్ ను కూడా ఎలివేట్ చేసేలా సుద్దాల సాహిత్యం కనిపించింది. దేవీ శ్రీప్రసాద్ సింపుల్ ట్యూన్ తో మెలోడియస్ గా మలిచాడీ గీతాన్ని. హర్ష కోనుగంటి డైరెక్టర్ గా పరిచయం అవుతోన్న ఈ చిత్రంతో రౌడీబాయ్స్ సంక్రాంతి బరిలో ఎలాంటి విజయం అందుకుంటారో కానీ.. ఈ పాటతో అనుపమా పరమేశ్వరన్ అదరగొట్టిందనే చెప్పాలి.

Related Posts