Raviteja : మరోసారి రవితేజ – గోపీచంద్.. సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తిని పెంచుతాయి. అందుకు ప్రధాన కారణం వారి కలయికలో వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ కావడమే. మాస్ మహరాజ్ ఇచ్చిన అవకాశంతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు గోపీచంద్ మలినేని. వీరి కాంబినేషన్ లో గోపీచంద్ ఫస్ట్ మూవీగా వచ్చిన డాన్ శీను సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత దర్శకుడుగా గోపీచంద్ కు వెంకటేష్‌ తో బాడీగార్డ్ మూవీ రీమేక్ చేశాడు. ఇది పోయింది. దీంతో మళ్లీ మాస్ మహరాజే ఈ దర్శకుడిని నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాక్సాఫీస్ కు తమ కాంబినేషన్ కు ఉన్న బలుపు ఏంటో చూపించాడు. బలుపు కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే గోపీచంద్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాడు. బలుపు తర్వాత చేసిన పండగ చేస్కో, విన్నర్ రెండూ యావరేజ్ గా మిగిలాయి. అప్పుడు మళ్లీ రవితేజనే అప్రోచ్ అయ్యాడు.


వీరి కాంబినేషన్ లో హ్యట్రిక్ మూవీగా వచ్చిన క్రాక్ బ్లాక్ బస్టర్ అయింది. పోస్ట్ కరోనా తర్వాత వచ్చినా క్రాక్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అనిపించుకుంది. ఈ విజయంతో గోపీచంద్ కు ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గత సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో కమర్షియల్ గా మంచి విజయం చూశాడు.

తర్వాత రజినీకాంత్ తో చేస్తాడు.. చిరంజీవికి కథ చెప్పాడు అనే టాక్స్ వినిపించినా ఫైనల్ గా మళ్లీ మాస్ మహరాజ్ తోనే సినిమా చేయబోతున్నాడు.
అఫీషియల్ గానే కన్ఫార్మ్ అయిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు.

అయితే క్రాక్ లో రవితేజ పోతరాజు వీర శంకర్ అనే పాత్రలో నటించాడు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరును బట్టి చూస్తే సీక్వెల్ కు చాలా అవకాశాలున్నాయి.

పైగా ఆ సినిమాలో విలన్ చనిపోలేదు. జైల్లో మరికొందరు రెడీ అవుతారు. క్రాక్ క్లైమాక్స్ కామెడీగా ఎండ్ చేసినా మళ్లీ సీరియస్ గా సీక్వెల్ కు ఓపెన్ చేసే అవకాశాలున్నాయి. మరి సీక్వెల్ తో వస్తారా లేక కొత్త కథతో వస్తారా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. వీరి కాంబినేషన్ మాత్రం టాలీవుడ్ లో మరోసారి అంచనాలను పెంచుతుందనే చెప్పాలి.

Related Posts