మార్చి 8న పోటీ మామూలుగా లేదు

మార్చి 8, 2024.. ఇప్పుడు ఈ తేదీపైనే ఫోకస్ పెడుతున్నాయి చాలా సినిమాలు. అసలు ముందుగా ఈ డేట్ ను లాక్ చేసుకున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‘. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమాని వచ్చే యేడాది మార్చి 8న విడుదల చేయబోతున్నట్టు షూటింగ్ మొదలైనప్పుడే ప్రకటించాడు పూరి. ఇక.. డిసెంబర్ రెండో వారంలోనే విడుదలవ్వాల్సిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రం కూడా మార్చి 8 నే రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఒకవేళ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ కాకపోయినా.. బాలకృష్ణ-బాబీ కాంబోలో వస్తోన్న సినిమాని అయినా మార్చి 8 కి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉందట నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్.

మరోవైపు సంక్రాంతి బరిలో విడుదలవ్వాల్సిన ‘ఫ్యామిలీ స్టార్‘ కూడా మార్చి 8 పైనే దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ‘ఫ్యామిలీ స్టార్‘ కోసం ఓ వెడ్డింగ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ షూట్ లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఓ షెడ్యూల్ జరగాల్సి ఉంది. అది లేటవ్వడం కారణంగానే ఈ సినిమాని వచ్చే యేడాది మార్చి 8 కి పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత దిల్ రాజు. ఏదేమైనా.. మార్చి 8న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ అయితే ఓ రేంజులో ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.

Related Posts