తెలుగు రాష్ట్రాల్లో ఒక‌రోజు ముందుగానే ఆర్ఆర్ఆర్ స్పెష‌ల్ షోస్..?

ఆర్ఆర్ఆర్… ప్ర‌పంచ సినీ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ. బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించిన‌ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా కావ‌డం.. ఇందులో నంద‌మూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించ‌డంతో ఆకాశ‌మే హ‌ద్దు అనేలా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. క‌రోనా కార‌ణంగా చాలా సార్లు వాయిదా ప‌డిన ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

యు.ఎస్ లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ప్రీమియ‌ర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రుగుతున్నాయి. అటు చ‌ర‌ణ్ అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు పోటీప‌డి టిక్కెట్లు కొంటున్నారు. అలాగే అభిమానులు ఏకంగా ఒక‌టి రెండు కాకుండా.. ఒక్కొక్క‌రు వంద‌లు.. వేల‌ల్లో టిక్కెట్లు కొంటుండ‌డం విశేషం. ప్రీమియ‌ర్స్ లో స‌రికొత్త రికార్డు దిశ‌గా ఆర్ఆర్ఆర్ దూసుకెళుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

విష‌యం ఏంటంటే.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రోజు ముందుగానే అంటే.. మార్చి 24న తేదీనే ఆర్ఆర్ఆర్ పేయిడ్ ప్రీమియర్స్ వేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. మేక‌ర్స్ నుంచి అఫిషియ‌ల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. మెగా అభిమానులు, నంద‌మూరి అభిమానులు మాత్రం ఒక‌రోజు ముందుగా ప్రీమియ‌ర్స్ వేస్తే బాగుంటుంద‌ని.. ముందుగా సినిమా చూడాల‌నుకుంటున్నామ‌ని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ‌రి.. ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ ఏం చేస్తారో చూడాలి.

Related Posts