తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిది. ‘బాహుబలి‘ సిరీస్ తో దక్షిణాది చిత్రాలకు ఉత్తరాదిన రెడ్ కార్పెట్ పరిచిన జక్కన్న.. ఆ తర్వాత అదే బాటలో వెళ్లేలా ‘కె.జి.యఫ్, పుష్ప‘ సినిమాలకు మార్గనిర్దేశం చేశాడు. అసలు ‘కె.జి.యఫ్‘ను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకెళ్లడానికి రాజమౌళి అందించిన సహకారమే కారణం అని అప్పట్లో మేకర్స్ కూడా తెలిపారు. అలాగే.. జక్కన్న సూచనల మేరకే ‘పుష్ప‘ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశామని దర్శకుడు సుకుమార్ కూడా చెప్పాడు.
ఇప్పుడు మళ్లీ ‘సలార్‘ కోసం రంగంలోకి దిగుతున్నాడట రాజమౌళి. విడుదలకు కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నా.. ‘సలార్‘ ప్రచారం కోసం ఇప్పటివరకూ నటీనటసాంకేతిక నిపుణులు ఎవ్వరూ బయటకు రాలేదు. అయితే.. విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చే బదులు టీమ్ అంతా కలిసి ఒకే ఒక్క ఇంటర్యూని ప్లాన్ చేస్తున్నారట. అది కూడా దర్శకధీరుడు రాజమౌళితో. ముఖ్యంగా.. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ ముగ్గురితోనూ కలిపి ‘సలార్‘ కోసం రాజమౌళి ఓ ఇంటర్యూ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈరోజో రేపో ఆ స్పెషల్ చిట్ చాట్ పై అనౌన్స్ మెంట్ రాబోతుందట.