పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటించిన భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. మార్చి 11న రాధేశ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
విధికి, ప్రేమకు మధ్య సాగే యుద్ధం నేపథ్యంలో సరికొత్త కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ పామిస్ట్ గా నటించారు. జ్యోతిష్యం.. హస్తసాముద్రికం.. తదితర అంశాలకు సంబందించి హీరో పాత్ర ప్రధాన హైలైట్ గా నిలుస్తుందట. రాజులు.. యువరాజులు.. ప్రెసిడెంట్స్.. ప్రైమ్ మినిస్టర్ ల వంటి పెద్ద పెద్ద వారికి సలహాలిచ్చే వ్యక్తిగా ప్రభాస్ కనిపిస్తారని తాజాగా దర్శకుడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేశారు.
ఇక అసలు విషయానికి వస్తే… ఏ సినిమాకైనా.. ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమాకైనా.. ప్రమోషన్ అనేది కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేస్తే… అంత మంచిది. అందుకనే.. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు. డిఫరెంట్ గా తమ సినిమాను ప్రమోట్ చేసి.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రత్యేక కౌంటర్లని ఏర్పాటు చేశారు.
రాధేశ్యామ్ సినిమాలో హీరో పామిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ రిలీక్ కానున్న థియేటర్లలో ఆస్ట్రాలజీ కౌంటర్స్ ని ఏర్పాటు చేసి అందులో ఓ హస్తసాముద్రికా నిపుణుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఈ కౌంటర్లని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ని కలిగించి సినిమా ప్రమోషన్స్ కోసం రాధేశ్యామ్ టీమ్ చేస్తున్న ఈ డిపరెంట్ ప్రమోషన్స్ ని చూసిన వారంతా ఐడియా అదిరింది అంటూ అభినందిస్తున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ తోనే కాకుండా ప్రమోషన్స్ తో సైతం ఆకట్టుకున్న రాధేశ్యామ్ ఇక సినిమా కూడా ఆకట్టుకుని ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.