గుజరాత్ లో ‘గూఢచారి-2’ యాక్షన్

స్టార్ పవర్ తో ఏమాత్రం పనిలేకుండా కేవలం కంటెంట్ నే నమ్ముకున్న కథానాయకుడు అడవి శేష్. ఈతరంలో తెలుగులో థ్రిల్లర్ మూవీస్ కి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చిన హీరోగానూ శేష్ కి మంచి గుర్తింపు ఉంది. ఇక.. అడవి శేష్ నటించిన చిత్రాలలో ‘గూఢచారి’కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు రచయిత కూడా అతనే. 2018లో వచ్చిన ‘గూఢచారి’ కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ. 25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ‘గూఢచారి’ హిందీ అనువాదానికి వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

‘గూఢచారి’ మూవీ చివరిలోనే సీక్వెల్ పై హింట్ ఇచ్చారు. మధ్యలో కోవిడ్ కారణంగా ‘గూఢచారి 2’ పట్టాలెక్కడానికి ఎక్కువ సమయమే పట్టింది. ‘గూఢచారి’ సినిమాకి దర్శకత్వ శాఖలోనూ, ఎడిటింగ్ శాఖలోనూ పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ‘గూఢచారి 2’కి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ వంటి సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘గూఢచారి 2’ ప్రస్తుతం గుజరాత్ లోని భుజ్ ఘాట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ బనిత సంధు కూడా పాల్గొంటుంది. ఈ మూవీలో బాలీవుడ్ వెటరన్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ‘గూఢచారి 2’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts