యాత్ర2 కోసం దుల్కర్ సాల్మన్

జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ అన్ని భాషల్లోనూ అదరగొడుతున్న హీరో దుల్కర్ సాల్మన్. ఏ భాషలో సినిమా చేసినా ఆ భాషా కుర్రాడే అనిపించుకుంటున్నాడు. చాలాకాలం క్రితమే తమిళ్ ఆడియన్స్ ను మెప్పించిన దుల్కర్.. కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. ముఖ్యంగా మహానటి తర్వాత అతనికి ఇక్కడ ఫ్యాన్స్ మొదలయ్యారు. సీతారామంతో అభిమాన సంఘాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ మరింతగా ఆకట్టుకుంటోన్న దుల్కర్ సాల్మన్.. రాబోయే రోజుల్లో సౌత్ నుంచి తెలుగు మార్కెట్ పైనే ఎక్కువ కాన్ సెంట్రేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రభాస్ కల్కిలో కూడా ఉన్నాడు అనే టాక్ ఉంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు. అయితే రీసెంట్ గా అతని వద్దకు యాత్ర దర్శకుడు మహి వి రాఘవ వెళ్లాడట.


ఆనందో బ్రహ్మ అనే సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు రాఘవ.. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర మూవీ చేశాడు. మమ్మూట్టి వైఎస్ పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు దానికి కొనసాగింపుగా యాత్ర2 సినిమా చేయబోతున్నాడు. ఈ సారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. అయితే ఈ చిత్రంలో జగన్ పాత్ర కోసం దుల్కర్ సాల్మన్ ను అప్రోచ్ అయ్యాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో తండ్రి కొడుకులు నటించారు అనే అరుదైన రికార్డ్ కూడా అతని సొంతం అయ్యేది.. కానీ కావడం లేదు. ఎందుకంటే దుల్కర్ ఈ పాత్రకు నో చెప్పాడు.


ప్రస్తుతం అతను వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎంత సినిమా అయినా, నటనే అయినా.. ఆ ఇంపాక్ట్ పొలిటికల్ గా అతని కెరీర్ పై పడుతుంది. మనోళ్లు రజినీకాంత్ నే వదిలిపెట్టలేదు. ఇంక దుల్కర్ ను వదులుతారా.. ఎవరికి వాళ్లు ఆ పాత్ర చేసినందుకైనా అతన్ని ద్వేషిస్తారు. దీనికి తోడు అతని ఇతర సినిమాలపైనా ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఈ పొలిటికల్ లొల్లి ఎందుకనే యాత్ర2 కు నో చెప్పాడు దుల్కర్ సాల్మన్. ఇప్పుడున్న తెలుగు రాజకీయాలు చూస్తే అతనిది తెలివైన నిర్ణయమే అనిపిస్తోంది కదూ.

Related Posts