పవన్ పై ఆర్జీవీ ట్వీట్లు వైరల్‌

ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో ఉండే వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. సోమవారం మరో సారి వార్తల్లో నిలిచారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని ఉద్దేశిస్తూ సోమవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. పవన్‌కల్యాణ్‌ – రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు. అల్లు అర్జన్‌ హీరోగా ఇటీవల విడుదలైన ‘పుష్ప’ బీటౌన్‌లో భారీ వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించిందని.. కాబట్టి ‘భీమ్లానాయక్‌’ని సైతం పాన్‌ఇండియా చిత్రంగా తీసుకురావాలని కోరారు.

‘పవన్‌కల్యాణ్‌ నటించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ని హిందీలో రిలీజ్‌ చేయవద్దని, అక్కడ వర్కౌట్‌ కాదని అప్పట్లో ట్విట్టర్‌ వేదికగా చెప్పా. కానీ మీరు వినలేదు. ఫలితం చూశారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయండి. మీ శక్తిని నిరూపించుకోవాలి’ అని రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్‌ చేశారు.

‘పుష్ప’యే అంత వసూళ్లు రాబడితే.. మరి, మీ సినిమా ఎంత కలెక్ట్‌ చేయాలి? ‘భీమ్లానాయక్‌’ పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయకపోతే మీ అభిమానులమైన మేమంతా వేరే హీరో అభిమానులకు సమాధానం చెప్పలేం. ఇటీవల నేను అల్లుఅర్జున్‌ గురించి పెట్టిన ట్వీట్స్‌ అన్నీ వోడ్కా టైమ్‌లో పెట్టా. కానీ.. ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్‌ కాఫీ టైమ్‌లో పెడుతున్నా. ఇప్పటికైనా నా సీరియస్‌నెస్‌ అర్థం చేసుకోండి’ అంటూ ట్విట్టర్‌లో కోరారు.

‘మీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్‌, తారక్‌లు కూడా పాన్‌ఇండియా స్టార్స్‌ అయిపోతుంటే మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి ‘భీమ్లానాయక్‌’ని పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయండి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ‘పుష్ప’, ‘కొమరం భీమ్‌’, ‘అల్లూరి సీతారామరాజు’ కథలు పాన్‌ఇండియా అయినప్పుడు ‘భీమ్లానాయక్‌’ కథ పాన్‌ వరల్డ్ సబ్జెక్ట్‌ కాదంటారా?’’ అంటూ వర్మ.. ట్విట్టర్‌ వేదికగా పవన్‌ని ప్రశ్నించారు.

Related Posts