ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ ముహ‌ర్తం కుదిరిందా.?

ఉప్పెన.. చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంచ‌ల‌న చిత్రం. మెగాస్టార్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రంతోనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించి అందరి దృష్టిని ఆక‌ర్షించాడు ఈ యంగ్ డైరెక్ట‌ర్. ఇక‌ త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేయ‌నున్న‌ట్టుగా గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

అయితే.. ఎన్టీఆర్.. కొర‌టాల శివ‌తో సినిమా చేస్తుండ‌డంతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చ‌ర్చ‌ల్లో ఉంది. అందుచేత‌ బుచ్చిబాబు సినిమా ఇప్ప‌ట్లో సెట్స్ పైకి రాక‌పోవ‌చ్చు అని టాక్ వ‌చ్చింది. తాజా వార్త ఏంంటే… బుచ్చిబాబుతో సినిమాకి ఎన్టీఆర్ ఓకే చెప్పార‌ట‌. అవును.. నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింద‌ని స‌మాచారం. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ కాంబినేషన్ ను పెర్ఫెక్ట్ గా సెట్ చేశారు.

అందుకు సంబంధించిన ప్రకటనను ఏప్రిల్ 11వ తేదీన చేయడానికి సన్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఆ రోజున ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక సమాచారంతో పాటు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీగా ప్లాన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మ‌రి.. ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజున టైటిల్ కూడా ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

Related Posts