ప్రభాస్ మూవీలో కృష్ణంరాజు కూడా ఉన్నాడా..?

డార్లింగ్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తో పాటు కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపీకృష్ణా బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు. అయితే సినిమాపై ఇప్పటి వరకూ ఆశించినంత బజ్ అయితే రాలేదు. అందుకు ప్రధాన కారణం రాధేశ్యామ్ చాలా చాలా ఆలస్యం కావడమే. గతంలో గోపీచంద్ తో జిల్ అనే ఒకేఒక్క సినిమా డైరెక్ట్ చేసిన రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ప్రభాస్ అభిమానుల మధ్య రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహించబోతుండటం విశేషం. మొత్తంగా ఇప్పటి వరకూ గోప్యంగా ఉంచిన ఓ విషయాన్ని చిత్ర టీమ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా నటించాడు. లేటెస్ట్ గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.


కృష్ణంరాజు ఈ పాత్రలో పరమహంస అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పేరుకు తగ్గట్టుగానే ఆయన లుక్ చాలా బావుంది. సాధువు గెటప్ లో ఆ పాత్రకు తగ్గట్టుగా అచ్చంగా ఒదిగిపోయారు కృష్ణంరాజు. తనకున్న రెబల్ స్టార్ బిరుదుకు పూర్తి వైవిధ్యంగా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. అయితే కథాగమనం సాగేది యూరప్ లో. పరమహంస భారత్ కు చెందిన వ్యక్తి. మరి ఈ ఇద్దరి మధ్య సంబంధాన్ని దర్శకుడు ఎలా మలిచాడు అనే ఆసక్తి కూడా మొదలైంది.
ఏదేమైనా ఇప్పటి వరకూ సినిమాకు భారీ అంచనాలు రాలేదు. ఒకవేళ ట్రైలర్ ఏమైనా మార్పులు తెస్తుందేమో చూడాలి. అసలే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ వంటి భారీ చిత్రాలు. ఆ పోటీలో నిలవాలంటే ట్రైలర్ లోనే ఏదో ఒకటి తేల్చాలి.

Related Posts