ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి.. తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా. సంగీత దర్శకుడిగా దాదాపు ఐదు దశాబ్దాల ప్రస్థానం.. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం.. ఇది ఇళయరాజా రికార్డ్.
తరాలు మారుతోన్నా.. తరగని సంగీత నిధిని సొంతం చేసుకున్న ఇళయారాజా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా సాగుతున్నారు. అయితే.. ఈమధ్య అంతే స్థాయిలో వివాదాలలోనూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా.. తను స్వర పరిచిన చిత్రాల్లోని సంగీతాన్ని కానీ.. నేపథ్య సంగీతాన్ని కానీ.. తన అనుమతి లేకుండా ఎవరైనా వాడితే వారికి ఆయన నోటీసులు పంపించడం పరిపాటిగా మారింది.
కొన్నేళ్ల క్రితం తన మిత్రుడు బాలసుబ్రహ్మణ్యంతో ఇదే విషయంపై ఇళయరాజాకి పెద్ద వివాదమే జరిగింది. ఆ తర్వాత అది సద్దుమణిగింది. లేటెస్ట్ గా రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ‘ మేకర్స్ కి షాకిచ్చారు ఇళయరాజా. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న రజనీకాంత్ ‘కూలీ‘ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేస్తూ ఆమధ్య చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ గ్లింప్స్ లో గతంలో ఇళయరాజా.. రజనీకాంత్ ‘తంగ మగన్‘ కోసం కంపోజ్ చేసిన ‘వా వా పక్కం వా‘ అనే బిట్ ను వాడారు. దీంతో.. తన అనుమతి లేకుండా ఆ మ్యూజికల్ బిట్ ను వాడడం సరికాదని మేకర్స్ కు నోటీసులు పంపించారు ఇళయరాజా. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.