దక్షిణాదిలో పూర్తిగా ఖాళీ అయిన బిజెపి

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ముందు తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే సంచలన నిర్ణయం ప్రకటించింది. చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి మాట్లాడుతూ ఎన్డీయే కూటమితో బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే మాజీ నేతలతో పాటు తమ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై ఏడాదిగా బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఎన్డీఏలో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఉన్నా తమిళనాడులో మాత్రం ఇరు పార్టీల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకేసి దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. అయినా కానీ బీజేపీ పెద్దలు అన్నామలైపై చర్యలు తీసుకోకపోవడం అన్నాడీఎంకే నేతలకు మింగుడుపడలేదు. అలాగే బీజేపీతో కూటమి వల్లే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిందనే అభిప్రాయం కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో బలంగా ఉంది. దీంతో ఇప్పుడు కమలం పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు.

ఉత్తరాది రాష్ట్రాలో ఎంతో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అత్యంత బలహీనంగా ఉంది. మొన్నటి వరకు ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పుడు అక్కడ కూడా అధికారం కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. ఇప్పుడు తమిళనాడులో పెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకే కూడా పొత్తుకు బైబై చెప్పడంతో కమలం పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక త్వరలో రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం ఇక ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని జోస్యం చెబుతున్నారు

Related Posts