ఎన్టీఆర్ నాణెం చెల్లదు.. కానీ ధర ఎక్కువ

యుగపురుషుడు ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ₹100 స్మారక నాణెంను ముద్రించారు. ఈ సోమవారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.

అయితే ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్, లోకేష్ మాత్రం హాజరు కాలేదు. అటు తనను పిలవలేదని లక్ష్మీ పార్వతి తన ఆవేదనను మీడియా ముందు వెల్లగక్కారు. బట్ ఎవరున్నా లేకున్నా నాణెం మాత్రం విడుదలైంది. అయితే అంతా అనుకుంటున్నట్టుగా ఇది చలామణిలో ఉండదు. చలామణి కోసం కూడా కాదు. కేవలం ఆయన జ్ఞాపకార్థంగా దాచుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. మరి ఈ నాణేన్ని ఎక్కడ తయారు చేశారు ఎలా పొందాలి అంటే.. మింట్ చీఫ్ మేనేజర్ నాయుడు అలా అన్నారు.


“ఎన్టీఆర్ స్మారక నాణెం హైదరాబాద్ లోనే తయారీ చేశాం. ఇది మార్కెట్లో చలామణి కోసం కాదని చెప్పారు. తొలి విడతలో 12వేల స్మారక నాణేలు ముద్రించామన్నారు. నాణేల ధర రూ.3,500 నుంచి రూ.4,850 వరకు ఉంటుందని వివరించారు. రేపటి(మంగళవారం) నుండి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా అమ్మకం ప్రారంభం.. డైరెక్ట్ గా కొనాలనుకునేవారు.. సైఫాబాద్ మింట్ సేల్ కౌంటర్ మరియు ఐజి మింట్ చర్లపల్లి సేల్ కౌంటర్ల నుండి కొనుగోలు చెయ్యవచ్చు..” అని ఆయన వివరించారు.


సో వంద రూపాయల నాణెం చెల్లుబాటు కాదు. కానీ దాన్ని కొనాలంటే మాత్రం మూడున్నర నుంచి దాదాపు ఐదువేల రూపాయల వరకూ చెల్లించాలన్నమాట. మరి అన్నగారి జ్ఞాపకం కోసం ఎంతమంది ముందుకు వస్తారో ఈ మొదటి విడతలో ముద్రించిన 12వేల నాణేల అమ్మకాన్ని బట్టి తెలుస్తుంది.

Related Posts