Sandeep reddy vanga : ఫస్ట్ టైమ్ గ్యాంగ్ స్టర్ గా మహేష్‌ బాబు

సూపర్ స్టార్ మహేష్‌ బాబు మూవీ అంటే మాగ్జిమం గ్యారెంటీగా మారిందిప్పుడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

అయితే మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నాడు. అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో అంటున్నారు. నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ తో అతను ముందుగా వెళ్లి కలిసింది మహేష్‌ బాబునే.

మహేష్‌బాబు కూడా అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ ను ఇంటికి పిలిపించి మరీ అభినందించాడు. దీంతో అప్పట్లోనే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందనే కమెంట్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగా సందీప్ కూడా మహేష్‌ కు కథ చెప్పాడు అన్నారు. మరి ఎందుకో అది అప్పుడు వర్కవుట్ కాలేదు. బట్ ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనే వార్త వినిపిస్తోంది.


సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కడ రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. అతని కమిట్మెంట్ ప్రకారం నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీ తర్వాతే మహేష్‌ తో సందీప్ సినిమా ఉంటుందని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇది మహేష్‌ కు 30 లేదా 31వ సినిమాగా ఉంటుందని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్నది 28వ సినిమా.

దీని తర్వాత మహేష్‌ – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. వాటిని అందుకోవాలంటే అప్పటికి సందీప్ యానిమల్, స్పిరిట్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఉండాలి. అదే జరిగితే.. ప్యాన్ ఇండియన్ రికార్డులన్నీ ఈ కాంబినేషన్ లో బ్రేక్ అవుతాయని చెప్పాలి.
ఇక ఈ మూవీలో మహేష్‌ బాబు ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడు అనే రూమర్స్ బాలీవుడ్ నుంచే వినిపిస్తుండటం మరో విశేషం. మహేష్‌ గ్యాంగ్ స్టర్ అంటే ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో పండగే అవుతుందని చెప్పొచ్చు.

Related Posts