బెల్లంకొండకు ఖాకీ కలిసొస్తుందా..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. భారీ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ తనయుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచి మాస్ ఆడియన్స్ టార్గెట్ గానే కథలు కదుపుతున్నాడు.కానీ కమర్సియల్ గా మాత్రం అవి పెద్దగా వర్కవుట్ కావడం లేదు. భారీ యాక్షన్ సీన్స్ , మంచి డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నా.. ఇంకా డిక్షన్ విషయంలో మెరుగవలేదు శ్రీనివాస్.

రీసెంట్ గా తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి భంగపడ్డాడు కూడా. అంతకు ముందు తెలుగులో రాక్షసుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దాన్ని కంటిన్యూ చేస్తాడు అనుకుంటే తర్వాత వరుసగా సీత, అల్లుడు అదుర్స్ అంటూ ఆడియన్స్ ను బెదరగొట్టాడు.

ఆ తర్వాత పడ్డ మరో డిజాస్టరే ఈ ఛత్రపతి రీమేక్. మామూలుగా అతనికి హిందీ డబ్బింగ్ మార్కెట్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఒక్కో సినిమాకు పది కోట్లకు పైగానే డబ్బింగ్ రైట్స్ రూపంలో వస్తాయి. ఈ విషయంలో శ్రీనివాస్ తెలుగులో ఉన్న చాలామంది స్టార్ హీరోల కంటే బెటర్ కావడం విశేషం. ఆ నమ్మకంతోనే అక్కడ సినిమా చేస్తే అది కాస్తా పోయింది. దీంతో ఇక మళ్లీ తెలుగుపైనే కాన్ సెంట్రేట్ చేస్తున్నాడు.


ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు శ్రీనివాస్. టైసన్ నాయుడు అనే వెరైటీ టైటిల్ తో రాబోతోన్న ఈ చిత్రంలో శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఇంతకు ముందు కూడా రెండు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేశాడు. కవచం, రాక్షసుడు చిత్రాల్లో అతను ఖాకీ కట్టాడు. ఈ రెండూ రీమేక్ లే కావడం విశేషం. రాక్షసుడు తమిళ్ మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేసింది. దానికంటే ముందే వచ్చిన కవచం మాత్రం పోయింది.

ఇక ఇప్పుడు మరోసారి పోలీస్ పాత్రలో రాబోతున్నాడు. అయితే దర్శకుడు సాగర్ చంద్ర కథలు, టేకింగ్ మేకింగ్ కొత్తగా ఉంటుంది. హీరోలే కాదు.. అతని సినిమాలు కాస్త పకడ్బందీగా ఉంటాయి. అయ్యారే చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యి విమర్శకులను కూడా మెప్పించిన అతను తర్వాత అప్పట్లో ఒకడుండేవాడు మూవీతో కమర్షియల్ హిట్ కూడా అందుకున్నాడు.ఈ మూవీకి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్‌, రానా హీరోలుగా చేసిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ అనిపించుకుంది. సో.. శ్రీనివాస్ తో చేసే సినిమాపై అంచనాలు పెరగడానికి ఇవి చాలు. మరి ఈ మూడో ఖాకీ డ్రెస్ శ్రీనివాస్ కు కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts