రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడు.. ఇదిగో ప్రూఫ్!

‘బాహుబలి’ సిరీస్ తో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసినట్టే.. ‘కె.జి.యఫ్’ సిరీస్ తో కన్నడ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత ప్రశాంత్ నీల్ కి దక్కుతుంది. స్వతహాగా తెలుగు వాడైన ప్రశాంత్ నీల్.. పెరిగిందంతా కన్నడ నేలపైనే. అందుకే.. తొలుత కన్నడ స్టార్స్ తో సినిమాలు చేసినా.. ఇప్పుడు వరుసగా టాలీవుడ్ స్టార్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతున్నాడు.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ కిట్టీలో ‘కె.జి.యఫ్ 3, సలార్ 2, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలున్నాయి. అయినా.. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ పై ముందుగానే హింట్ ఇస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ లిస్టులో ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కూడా చేరింది. గతంలోనే చిరంజీవి, చరణ్ లను ప్రత్యేకంగా కలుసుకున్న ప్రశాంత్ నీల్.. మెగా హీరోలిద్దరితోనూ మల్టీస్టారర్ చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఆ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడు వాటిన్నంటినీ నిజం చేసేటట్టు.. చరణ్ బర్త్ డే స్పెషల్ గా సర్ప్రైజింగ్ ట్వీట్ చేశాడు ప్రశాంత్ నీల్. చిరంజీవి, చరణ్ లతో కలిసున్న ఒక ఫోటోను.. చరణ్, డి.వి.వి దానయ్యతో దిగిన మరో ఫోటోను షేర్ చేస్తూ.. రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపాడు. అంతేకాదు.. మన కొలాబరేషన్ లో అత్యద్భుతమైన చిత్రాన్ని తీసుకొద్దాం.. మనిద్దరం కలిసి మ్యాజిక్ చేద్దాం అంటూ ట్వీట్ చేశాడు ప్రశాంత్. ఇప్పటికే మూడు బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న చరణ్ కిట్టీలో ఇప్పుడు ప్రశాంత్ నీల్ రూపంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని.. ఆనందంలో ఉన్నారు మెగా ఫ్యాన్స్.

Related Posts