బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పనామా పేపర్స్ లీక్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. 2016లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసుతో ఎంతో మంది సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అప్పటి నుంచి ఈడీ చాలా మందిని ఎంక్వైరీ చేసింది. అయితే.. ఓ ఫేక్ కంపెనీతో ఐశ్వర్యకి సంబంధం ఉన్నట్లు ఈడీ అనుమానం. ఈ కారణంగా ఐశ్వర్యరాయ్ ని చాలా రోజులుగా విచారించడానికి ప్రయత్నిస్తోంది.
వివిధ కారణాల వలన రెండు సార్లు ఈడీ విచారణకు హాజరు కాని ఐశ్వర్య డిసెంబర్ 20న ఢిల్లీలోని హెవ్ క్వార్టర్స్ లో విచారణకు హాజరయ్యింది. ఈ విచారణలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. దీంతో ఈడీ ఐశ్వర్యను ఏ ఏ ప్రశ్నలు అడిగింది..? ఐశ్వర్య ఏం సమాధానం చెప్పింది..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఈడీ అడిగిన ప్రశ్నలు ఏంటంటే.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్టనర్స్ కంపెనీకి, మీకు సంబంధం ఏంటి? మొసాక్ ఫోన్సెకా కంపెనీని రిజిస్టర్ చేసిన న్యాయ సంస్థ మీకు తెలుసా? ఈ కంపెనీ డైరెక్టర్లలో మీరు, మీ నాన్న కోటేదాడి రమణ రాయ్ కృష్ణ రాయ్, మీ తల్లి కవితా రాయ్, మీ సోదరుడు ఆదిత్య రాయ్ ఉన్నారు. దీని గురించి ఏం చెబుతారు?
ప్రారంభంలో చెల్లించిన క్యాపిటల్ 50,000 డాలర్లు. 1 డాలరు విలువ చేసే 12,500 షేర్లు ఒక్కో డైరెక్టర్కి ఉన్నాయి. మొదట డైరెక్టర్గా ఉన్న మీరు అనంతరం ఎందుకు వాటాదారు అయ్యారు? జూన్ 2005లో మీరు కేవలం వాటాదారుగా ఎందుకు మారారు? 2008 నుంచి ఆ కంపెనీ ఎందుకు పనిచేయట్లేదు? ఆర్థిక లావాదేవీల కోసం ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా?
అంటూ పలు ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. అయితే.. వీటికి ఐశ్వర్య ఏం సమాధానాలు ఇచ్చింది..? ఐశ్వర్య సమాధానాలకు ఈడీ ఎలా స్పందించింది అనేది బయటకు రాలేదు.