దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా.. నేనున్నాను అంటూ ఆయన పరిష్కరించేవారు. ఆయన మరణించిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరంజీవి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. అయితే.. కొంత మంది ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవరూ లేరు అని కామెంట్లు చేశారు. ఇది చిరంజీవిని బాగా బాధించింది అనుకుంటా.. ఆ పదవికి నాకు వద్దు అన్నారు చిరంజీవి.
ఈరోజు సినీ కార్మికులకు సంబంధించిన ఫంక్షన్ లో పాల్గొన్న చిరంజీవిని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండి సమస్యలను పరిష్కరించాలని కొంత మంది కోరడం జరిగింది. దీనికి చిరంజీవి స్పందిస్తూ.. కరోనాతో చాలా మంది ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికిపోయారు. సినీ కార్మికుల కోసం ఏదైనా చేయాలనీ ఆలోచించాను. సినీ కార్మికులకు భవిష్యత్ లో ఏం కావాలన్నా చేస్తాను. అయితే.. సినిమా ఇండస్ట్రీకి నేను పెద్ద కాను. ఆ పదవిలో ఉండలేను.
అవసరానికి అండగా ఉంటాను. అంతే కానీ.. అనవసర పంచాయతీలు నాకొద్దు. బాధ్యతగా ఉంటాను. సమస్యలొస్తే ఆదుకుంటాను. అంతకు మించిన వ్యవహారాలను పట్టించుకోను. ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ముందుకు రాను. ఆ పంచాయితీలు నాకు వద్దు. ఇండస్ట్రీకి పెద్దగా ఉండడం నాకు పెద్ద ఇబ్బంది అంటూ వ్యాఖ్యానించారు.