ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. నార్త్ లో కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అయితే.. ఈ సినిమా గురించి సుకుమార్ తన మనసులో మాటలను బయటపెట్టి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఇంతకీ ఏం చెప్పారంటే.. బన్నీని పుష్పలాంటి శక్తిమంతమైన పాత్రలో చూపించాలన్న కోరిక నాకు ఆర్య సినిమా చేస్తున్నప్పటి నుంచే ఉండేది. ఈ విషయాన్ని ఆయనకు అప్పట్లోనే చెప్పాను. అయితే.. అలాంటి శక్తిమంతమైన పాత్రను చూపించాలంటే అందుకు తగ్గ కథా నేపథ్యం కావాలి. దానికి ఎర్ర చందనం బ్యాక్డ్రాప్ అయితేనే సరిగ్గా సరిపోతుందనిపించింది. అందుకనే ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేయడం జరిగింది.
నిజానికి ఈ కథను వెబ్ సిరీస్గా చేద్దామనుకున్నాను. స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాగానే చేయాలని నిర్ణయించుకున్నాను. ఆరేళ్ల పాటు రీసెర్చ్ చేసి ఈ కథ సిద్ధం చేసుకున్నాను. వీరప్పన్తో పాటు అనేక స్మగ్లర్ల గురించి చదివి తెలుసుకున్నా. సినిమాలో ఎర్రచందనం లోడును లారీ సహా బావిలో పడేసే సీన్ ఉంది కదా.. అది నిజంగా జరిగినదే. సినిమాని అల్లు అర్జున్ తన భుజాల పై మోశాడు. పుష్పరాజ్ పాత్రలో ఆయనెంతో చక్కగా ఒదిగిపోయారు. మార్చి నుంచి పుష్ప 2 షూటింగ్ చేస్తాను అన్నారు.