ఆమధ్య తనకు క్యాన్సర్ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సొనాలి బింద్రే, మలయాళ హీరోయిన్ మమతా మోహన్ దాస్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆతర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే.. వాళ్లు కీమో థెరపీ వల్ల ఎదుర్కొన్న విషయాల గురించి సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేయడం అప్పట్లో అందర్నీ కలచివేసింది. క్యాన్సర్ ను ధైర్యంతో ఎదుర్కొని సొనాలి, మమతా మోహన్ దాస్ క్యాన్సర్ నుంచి సక్సస్ ఫుల్ గా బయటపడ్డారు. అయితే.. సోనాలి బింద్రే సంఘటన మరవకముందే ప్రభాస్ హీరోయిన్ హాంసా నందిని సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ పలువురిని షాక్ కు గురిచేస్తోంది.
గుండుతో వున్న ఫొటోని హాంసా నందిని పోస్ట్ చేసి తనకు క్యాన్సర్ అని ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలో.. మిర్చి మిర్చి లాంటి కుర్రాడే అంటూ ఐటం సాంగ్ లో ఆకట్టుకున్న హంసా నందిని తనకు క్యాన్సర్ సోకిందని తాను రొమ్ము క్యాన్సర్ గ్రేడ్ -3 తో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.
అంతే కాకుండా చికిత్సలో భాగంగా తాను కీమో థెరపీ చేయించుకుంటున్నానని వెల్లడించింది.
దాని కారణంగానే తన జుట్టుని కోల్పోయానని తెలుపుతూ హంసా నందిని పెట్టిన పోస్ట్ ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టుగా నాలుగు నెలల క్రితమే గుర్తించానని అనుమానం రావడంతో వెళ్లి పరీక్షలు చేయించుకున్నానని.. కొన్ని టెస్ట్ ల అనంతరం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వున్నట్టుగా తేలిందని హంసా నందిని తన పోస్ట్ లో స్పష్టం చేసింది. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ కారణంగానే తన తల్లి మృతి చెందిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న హంసా నందిని భావోద్వేగానికి లోనైంది. త్వరలోనే హంసా నందిని క్యాన్సర్ నుంచి కోలుకోవాలని కోరుకుందాం.