పాదయాత్రలతో పైసలొస్తయా కృష్ణా ..

పాదయాత్ర.. అధికారం కోసం పొలిటీషియన్స్ కు అద్భుతమైన దారి. దారులు పట్టుకుని నడిస్తూ వెళ్లి జనాలను కలిస్తే ఓట్లు వస్తాయి. తర్వాత అధికారం వస్తుందనే నమ్మకంతో పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతుంటారు వాళ్లు. మరి అదే రూట్ లో సినిమా వాళ్లు కూడా వెళితే జనం టికెట్లు తీసుకుంటారా..? అనేది పెద్ద ప్రశ్న. నిజమే.. పాదయాత్రలో పాల్గొంటే సాధారణ జనాలకు స్థానిక నాయకులు డబ్బులు ఇస్తారు అనేది ఓపెన్ సీక్రెట్. మరి సినిమా వాళ్ల పాదయాత్రలో పాల్గొంటే ఆ ఫెసిలిటీ లేకపోగా వాళ్లే ఉల్టా డబ్బులు ఇచ్చి టికెట్స్ కొనాలి. మరి పాద యాత్ర వల్ల సినిమాకి ఏదైనా ఉపయోగం ఉందా..? అంటే ఉంటుందా లేదా అనేది మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ కు కృష్ణవృంద విహారి మూవీ టీమ్ శ్రీకారం చుట్టింది.

వీళ్లు ఏకంగా రెండు రాష్ట్రాల్లోని సెలెక్టెడ్ సిటీస్ లో మూవీ టీమ్ అంతా పాదయాత్ర చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ బుధవారం నుంచే పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఈ 14న తిరుపతిలో మొదలవుతుంది. 15న నెల్లూర్, ఒంగోలు, 16న విజయవాడ, ఏలూరు, గుంటూరు, 17న భీమవరం రాజమండ్రి, 18న కాకినాడ, వైజాగ్ లను చుట్టేయబోతున్నారు. ఫైనల్ గా సినిమాను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అనేకసార్లు పోస్ట్ పోన్ అయింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సైతం డల్ గానే ఉండటంతో బజ్ క్రియేట్ అవలేదు. అందుకే ఈ పాదయాత్ర స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నాగశౌర్య సొంత బ్యానర్ లోనే రూపొందించారు. శౌర్య సరసన షిర్లే షేథియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాధిక, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, సత్య ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఏదేమైనా హీరో హీరోయిన్లు ఒకరిద్దరు వెళితేనే జనం గుమికూడి నానా రచ్చ చేస్తారు. అలాంటిది మూవీ టీమ్ వీధుల్లో పడి తిరుగుతుంటే ఆ ప్రాంతంలోని జనాల ఇబ్బందులు, ట్రాఫిక్ కష్టాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహకే వదిలేయాలి.

Related Posts