ఇంకెన్నాళ్లీ దోపిడీ.. ఛలో పరుగెత్తు అంటోన్న రానా

రానా.. వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రల్లో మెరుస్తూ.. టాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ తెచ్చుకున్నాడు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైన ఈ హ్యాండ్సమ్ హంక్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా అతని లేటెస్ట్ మూవీ విరాట పర్వం నుంచి విడుదల చేసిన ‘వాయిస్ ఆఫ్ రవన్న’అనే టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. డైలాగ్స్ మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ టీజర్ తో సినిమా ఎలా ఉండబోతోందన్న అంచనాకు రావొచ్చు. ఆ రేంజ్ లో ఉన్నాయా మాటలు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి పల్లవి, నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు.
1990ల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో మాత్రం డైలమా కొనసాగుతోంది. ఓటిటిలో వస్తుందనుకున్నా.. నిర్మాతలు వెండితెరపైనే విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే అది ఎప్పుడు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇక టీజర్ లో ఉన్న డైలాగ్స్ చూస్తే ..
‘‘మారదులే ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే..
రౌతపు శతృవు దాడిని ఎదురించే పోరాటం మనదే. ఛలో ఛలో ఛలో పరుగెత్తు..
అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు.. ఛలో ఛలో ఛలో పరుగెత్తు
చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూరుపు కొండను వెలిగిద్దాం..
ఒంగిన వీపుల బరువును దించి విప్లవ గీతం వినిపద్దాం.. ఛలో ఛలో ఛలో పరుగెత్తు.
దొరోని తలుపుకు తాళంలా.. గడీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లూ ఇంకెన్నాళ్లు.. ఛలో ఛలో ఛలో పరుగెత్తు..’’
అంటూ వేణు రాసిన డైలాగులను రానా ఆవేశంగా పలుకుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ఈ సినిమా కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాయి పల్లవి పాత్ర మరో హైలెట్ గా కనిపించబోతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంటే సినిమా ఫిబ్రవరి లేదా జనవరిలోనే రిపబ్లిక్ డేకు విడుదల చేయొచ్చు అనుకోవచ్చు.

Related Posts