సాఫీగా సాగిపోతున్న ఓ కేబుల్ ఆపరేటర్ జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని.. తాను చూసిన సినిమాల పరిఙ్ఞానంతో.. తన కుటుంబాన్ని అతను ఎలా కాపాడుకున్నాడు అనే కథతో ‘దృశ్యం’ సినిమా వచ్చింది. మొదటిగా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలతో పాటు.. శ్రీలంకలోనూ ‘ధర్మయుద్ధాయ’ పేరుతో రీమేకై మంచి విజయాన్ని సాధించింది. ఇక.. చైనా భాషలో కూడా ఈ చిత్రం ‘షీప్ వితౌట్ ఎ షెపర్డ్’ పేరుతో రీమేక్ అయ్యి అక్కడా ఘన విజయాన్ని సాధించింది. ఇంకా.. ఇండోనేషియన్, కొరియన్ లాంగ్వేజెస్ లోనూ ఈ చిత్రం రీమేక్ అవుతోంది.
ఇవన్నీ పక్కన పెడితే ‘దృశ్యం’ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ లో రీమేక్ కాబోతుండడం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అయ్యింది. ఓ రీజనల్ ఫిల్మ్ హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం మామూలు విషయం కాదు. గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ రీమేక్ మూవీ షూటింగ్ మొదలుకానుందట. మొత్తంమీద.. ‘దృశ్యం’కి సీక్వెల్ గా వచ్చిన ‘దృశ్యం 2’ కూడా మంచి విజయాన్ని సాధించడం విశేషం. తెలుగులోనూ ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది.