డ్రగ్స్.. ఈ మాట వింటే చాలు టాలీవుడ్ ఉలిక్కి పడుతోంది. గతంలో పెద్ద ఎత్తున తెలుగు సినిమా పరిశ్రమలోని వ్యక్తులు డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారంటూ నానా హడావిడీ నడిచింది. అప్పట్లో అదంతా పొలిటికల్ ఇష్యూగా కొందరు చూశారు. కానీ తాజాగా జరిగిన రైడ్ తో టాలీవుడ్ లో ఈ వ్యవహారం కాస్త గట్టిగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే గతంలో వినిపించిన పేర్లలో ఒక్కరు కూడా ఈ సారి లేరు. ఏదైనా విచారణలో మళ్లీ పాత పేర్లు వినిపిస్తాయోమో కానీ.. ఇప్పుడైతే కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటెల్లోనే పుడింగ్ పబ్ లో అనుమతించిన టైమ్ ను దాటి పార్టీలు నిర్వహిస్తూ.. స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఆ పబ్ కు వెళ్లారు. నిజానికి ఇది లేట్ నైట్ పార్టీగానే పోలీస్ లు కూడా భావించారట. బట్.. అనూహ్యంగా పోలీస్ లు రావడంతో అప్పటి వరకూ డ్రగ్స్ లో మునిగి తేలుతున్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదే టైమ్ లో డ్రగ్స్ ను బయటకు విసిరేయడం పోలీస్ లు గమనించారు. దీంతో ఇదో పెద్ద వ్యవహారంగా భావించిన పోలీస్ లు అందరినీ విచారించడం మొదలుపెట్టారు. ఆ విచారణలోనే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది.
ఇక కొత్తగా వినిపించిన టాలీవుడ్ ప్రముఖుల్లో మరీ ఎక్కువమంది లేరు. కానీ నాగబాబు కూతురు నిహారికతో పాటు సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరు నిజంగా డ్రగ్స్ వాడారా లేదా అనేది తర్వాత వారికి నిర్వహించే మెడికల్ టెస్ట్ లో తెలుస్తుంది. కానీ అసలు ఆ ప్లేస్ లో అప్పటి వరకూ వీరుండటం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు గల్లా జయదేవ్ కొడుకు.. రీసెంట్ గా హీరో అనే సినిమాతో పరిచయం అయిన అశోక్ పేరూ వినిపించినా.. దాన్ని వారు ఖండించారు. కానీ నిజాలు విచారణలో తెలుస్తాయంటున్నారు పోలీస్ లు.
ఈ విషయంలో తమ వారి పేర్లను తప్పించేందుకు ఇప్పటికే పోలీస్ లపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. కానీ డ్రగ్స్ వ్యవహారం తెలంగాణకు తలనొప్పిగా మారిందని.. అందుకే ఈ సారి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు. ఇదే జరిగితే ఖచ్చితంగా.. ఇప్పుడు డ్రగ్స్ వాడిన వారితో పాటు ఈ దందా ఎక్కడి నుంచి జరుగుతోంది. కీలకమైన వ్యక్తులు ఎవరు..? ఇంతకు ముందు ఎవరికి సప్లై చేశారు.. ఈ లిస్ట్ లో రెగ్యులర్ గా వచ్చే పేర్లు ఏ ప్రముఖులవి, ఏ ప్రముఖుల వారసులవీ అనే నిజాలు తెలుస్తాయి. కానీ వరుస చూస్తోంటే వీళ్లంతా తెలంగాణలోని బిగ్ షాట్స్ గానే తెలుస్తోంది. వాళ్లను దాటుకుని నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయా సందేహం సామాన్యుల్లో కనిపిస్తోంది. ఏదేమైనా హైదరాబాద్ లో పబ్ కల్చర్ ఎప్పుడో హద్దులు దాటిందనేది తాజా ఉదంతంతో మరోసారి తెలిసిపోయింది.