గుంటూరు కారంలో భారీ మార్పులు.. ?

కొన్నాళ్లుగా షూటింగ్ లో కాకుండా ఇతర విషయాల్లో హాట్ టాపిక్ గా ఉంటోంది గుంటూరు కారం మూవీ. మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో దాదాపు 12యేళ్ల తర్వాత వస్తోన్న మూడో సినిమా ఇది. అంతకు ముందు చేసిన అతడు, ఖలేజా థియేటర్స్ లో ఆకట్టుకోలేదు. అందుకే ఈ గ్యాప్. ఇంత గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా అయినా ఎప్పుడూ షూటింగ్ సజావుగా సాగలేదు.

అసలు మొదట అనుకున్న కథనే పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చారు. అయితే ఒకే ఒక్క షెడ్యూల్ జరుపుకుని ఇదీ ఆగిపోయింది. అప్పటి నుంచి మళ్లీ ఎప్పుడు అనే మాటకు ఆన్సర్ లేదు. ఈలోగా సినిమాకు సంబంధించి మెయిన్ హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డే ప్రాజెక్ట్ నుంచే వెళ్లిపోయింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా ఉంది.

దీనికంటే ముందు థమన్ ను తప్పించారు అనే టాక్ వచ్చింది. అది ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ కు వెళ్లింది. వెంటనే థమన్ ను తప్పించలేదు అని మూవీ టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మళ్లీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చెప్పలేకపోతున్నారు కానీ.. ఒక్క విషయం మాత్రం తెలుస్తోంది. ఈ గ్యాప్ లో సినిమా కథకు సంబంధించి చాలా మార్పులు చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.


ఏ కథలో అయినా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత కూడా చిన్న చిన్న మార్పులు ఉండటం సహజం. అయితే ఈ కథలో చిన్నవి కాదు. చాలా పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయట. అంటే పూజాహెగ్డే వెళ్లిపోతుందని త్రివిక్రమ్ కు ముందే తెలుసంటున్నారు.

దీంతో ఇప్పటి వరకూ రెండో హీరోయిన్ అనుకున్న శ్రీ లీల మెయిన్ లీడ్ లోకి వచ్చింది. పూజా లేదు కాబట్టి.. శ్రీ లీలకు తగ్గట్టుగా కాంబినేషన్స్ తో సహా చాలా సన్నివేశాలు మళ్లీ మార్చి రాసుకున్నాడట త్రివిక్రమ్. అంటే మరో హీరోయిన్ కూడా ఉంటుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం. బట్.. సడెన్ గా మెయిన్ హీరోయిన్ గా మారిన శ్రీ లీల కోసం మాత్రం సీన్స్ రీ క్రియేట్ అయ్యాయంటున్నారు. సో.. పూజాకు తగ్గట్టుగా ఉన్న సీన్స్ ఇప్పుడు శ్రీ లీలకు తగ్గట్టుగా మారతాయన్నమాట.

Related Posts