మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుండడం తెలిసిందే. ఈ నెల 7 విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో చరణ్ జాయిన్ అయ్యారు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం కాగా, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం.
ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీని ప్రారంభించబోతున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా లైన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నానీతో శ్యామ్ సింగరాయ్ చిత్రం తీసి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. బెంగాలీ నేపథ్యంలో తీసిన ఈ పీరియాడికల్ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సక్సస్ సాధించింది. ఈ సినిమా రామ్ చరణ్ కి బాగా నచ్చింది.
అయితే.. ఇటీవల శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్.. చరణ్ కు ఓ థ్రిల్లర్ స్టోరీ వినిపించాడట. దానికి చరణ్ చాలా బాగా ఇంప్రెస్ అయి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇది రాహుల్ కి బంపర్ ఆఫరే. అయితే.. ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి చాలా టైమ్ పడుతుంది. శంకర్ తో చేస్తున్న సినిమా తర్వాత చరణ్ తో ముగ్గురు దర్శకులు పాన్ ఇండియా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు. అవి పూర్తయ్యాకా గానీ, రాహుల్ సినిమాను మొదలు పెట్టడం సాధ్యం కాదు. మరి.. రాహుల్ సాంకృత్యన్ అంత వరకూ వెయిట్ చేస్తాడా.? లేక వేరే హీరోతో మరో సినిమాని స్టార్ట్ చేస్తాడా..? అన్నది చూడాలి.