మందు పాటతో మెస్సేజ్ ఇచ్చిన వెంకీ

తరాలు మారినా తరగని అభిమానాన్ని సొంతం చేసుకునే కథానాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈతరం ప్రేక్షకులకు సైతం ఫేవరెట్ హీరోగా మారిన వెంకీ.. ప్రెజెంట్ తన ప్రెస్టేజియస్ 75వ చిత్రంగా ‘సైంధవ్‘ని తీసుకొస్తున్నాడు. ‘హిట్‘ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్ గా ‘సైంధవ్‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూసేజ్‘ రిలీజయ్యింది.

చేయొద్దురా చేయొద్దురా రాంగ్ యూసేజ్.. మందును చేయొద్దురా రాంగ్ యూసేజ్..‘ అంటూ మందు పాటలోనే మంచి మెస్సేజ్ ఇచ్చాడు. ఇక.. ఈ పాటలో సెల్ ఫోన్ గురించీ సందేశం ఉంది. ‘దునియాలో అందరికీ దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారీ సెల్ ని.. చివరికి నీకు నువ్వు దూరమై నువ్వే ఒక ఒంటరై ఈ సెల్లే నీకు జైల్ సెల్ అయినదే‘ అంటూ సెల్ ఫోన్ మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటూ సందేశాత్మక లిరిక్స్ అందించారు ఆస్కార్ విజేత చంద్రబోస్. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ లో నకాష్ అజీజ్ ఈ పాటను ఆలపించాడు.

‘సైంధవ్‘ సినిమాలో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, జయప్రకాష్‌ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తుంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సైంధవ్‘ విడుదలకానుంది.

Related Posts