‘ఉప్పెన’ జంటకు వరుస ఫ్లాపులు

రెండున్నరేళ్ల క్రితం విడుదలైన ‘ఉప్పెన’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కొత్త హీరో వైష్ణవ్ తేజ్, కొత్త హీరోయిన్ కృతి శెట్టి, కొత్త దర్శకుడు బుచ్చిబాబు కలయికలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. ఇక.. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. దీంతో వీరిద్దరికీ వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

‘ఉప్పెన’ తర్వాత కోవిడ్ సమయంలో ‘కొండపొలం’ సినిమా చేశాడు వైష్ణవ్. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. నటుడిగా వైష్ణవ్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే.. మొదటి రెండు సినిమాలలోనూ విలక్షణంగా కనిపించిన వైష్ణవ్ ఆ తర్వాత మాత్రం కమర్షియల్ బాట పట్టాడు. ఈకోవలోనే వచ్చిన ‘రంగ రంగ వైభవంగా, ఆదికేశవ’ రొటీన్ మూవీస్ గా మిగిలిపోయాయి.

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా తెలుగువారి మదిలో నిలిచిపోయిన కృతి శెట్టి.. అవకాశాల విషయంలో వైష్ణవ్ కి మిన్నగా దూసుకెళ్లింది. ‘ఉప్పెన’ తర్వాత వెంటవెంటనే ‘శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు’ వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. ‘ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ’ ఇలా.. ఒకదాని తర్వాత మరొకటిగా ఫ్లాపులు వచ్చి పడ్డాయి. క్యారెక్టర్స్ ఎంపిక విషయంలో సరైన ప్లానింగ్ లేకపోవడం కూడా కృతి ఫెయిల్యూర్స్ కి కారణాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో శర్వా 35 తో పాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తోంది కృతి. మొత్తంమీద.. ‘ఉప్పెన’ జంట త్వరలోనే మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వస్తుందని ఆశిద్దాం.

Related Posts