న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా వరంగల్లో శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు.
ఈ వేడుకలో హీరో నాని మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. ఆ సినిమా చూసి నేను డిసైడ్ చేయకూదని అనుకున్నాను కానీ ఈ రోజు నా సినిమాను చూశాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది.
ఇది నాకు సొంత బ్యానర్లా ఉంది. ఇలా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మా ప్రయాణం మొదలవ్వడం ఆనందంగా ఉంది. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సాయి పల్లవి నుంచి మీరు ఎంత డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను.
ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే. ఈ పాత్రను అర్థం చేసుకుంటుందా? లేదా? అని అనుకున్నాను. కానీ ప్రతీ రోజూ సెట్లో ఆమె తన పాత్ర కోసం కేర్ తీసుకునేది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. అరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉందిరా అని అనేవారు. ఆయనకు ఆ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు. ఈ క్రిస్మస్ మాత్రం మనదే అని అన్నారు.