ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు విషయమై.. గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు భారీ చిత్రాలకు టిక్కెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి కానీ.. ప్రభుత్వం మాత్రం అన్ని సినిమాలకు ఒకటే రేటు అని జీవో జారీ చేయడం జరిగింది. దీని వలన భారీ చిత్రాలకు భారీగా నష్టం అంటూ సినీ పెద్దలు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దీని గురించి ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని కొంత మంది కోర్టుకెక్కారు. కోర్టు భారీ చిత్రాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కోర్టు తీర్పు టాలీవుడ్ కు ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు ఈ తీర్పుతో ఇంతా అంతా ఆనందం కాదు. రేట్లు లేకపోవడం వల్ల పుష్ప 15 కోట్ల మేరకు ఆర్ఆర్ఆర్ 28 కోట్ల మేరకు రేట్లలో కోత పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కోర్టు తీర్పు వలన ఇప్పుడు రానున్న భారీ చిత్రాలకు పంటపండినట్టు అయ్యింది. సరిగ్గా విడుదలకు మూడు రోజుల ముందు తీర్పు రావడంతో పుష్ప మేకర్లకు ఆనందమే ఆనందం.
పుష్పతో పాటు, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు తదితర భారీ చిత్రాలకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఏర్పడింది. అయితే.. బ్యాడ్ లక్ అంటే.. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిదే. తక్కువ రేట్లలోను అఖండ అద్భుతమైన విజయం సాధించడం విశేషం.