గేరు మార్చిన కుర్రాడు.. జోరు పెంచేనా.. ?

జోరు ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే.. ఆ ఆనందం ఎక్కువ కాలం ఉంటుందంటారు. కానీ దాన్ని ఎక్కువ కాలం లేకుండా కుర్రాడిని కొండపొలం పంపించాడు దర్శకుడు క్రిష్‌. యస్.. ఇది వైష్ణవ్ తేజ్ గురించే. పంజా వైష్ణవ్ తేజ్ గా ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ మెగా మేనల్లుడు.. ఉప్పెనతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. సినిమా కమర్షియల్ గా బిగ్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యాడు. ఫస్ట్ మూవీకి ఎంచుకున్న కథ చూసి కుర్రాడు మంచి హీరో అవుతాడు అనుకున్నారు. బట్ క్రిష్‌ తో రెండో సినిమా కొండపొలం చేసి ఖంగు తిన్నాడు. ఓ గొప్ప నవలను సినిమాగా చేసి క్రిష్‌ చెడగొడితే.. అతని డైరెక్షన్ లో మొహమాటానికి నటించిన వైష్ణవ్ కు షాక్ తప్పలేదు. దీంతో కొంతకాలంగా సైలెంట్ గా కనిపిస్తున్నా.. ఇప్పుడు అతను నటించిన రంగ రంగ వైభవంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అర్జున్ రెడ్డిని తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టిన గిరీశయ్య డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో అతని సరసన కేతికశర్మ హీరోయిన్ గా నటించింది. ఇక లేటెస్ట్ గా అతని నాలుగో సినిమా కూడ అనౌన్స్ అయింది. ఇది ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుండటం విశేషం.

వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా గతంలోనే సితార బ్యానర్ లో ఓకే అయింది. పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి అనూహ్యంగా సితార బ్యానర్ ఓ అనౌన్స్ మెంట్ వీడియో విడుదల చేసింది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించబోతోన్న ఈ మూవీ నుంచి వచ్చిన వీడియో చూస్తే వైష్ణవ్ ఇప్పటి వరకూ చేసిన మూడు సినిమాలకు భిన్నంగా ఓ ఊరమాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడన్న విషయం అర్థమౌతోంది. ఫస్ట్ డైలాగ్ తోనే ఇదో కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనే కలరింగ్ వచ్చేలా చూసుకున్నారు. వైష్ణవ్ తేజ్ లుక్ కి మాస్ మూవీస్ బానే సెట్ అవుతాయి. కానీ ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో వచ్చాయి. రంగ రంగ వైభవంగా కూడా ఓ ప్రేమకథా చిత్రంగానే వస్తోంది. సినిమా పరిశ్రమలో నిలబడాలంటే మాస్ ఆడియన్స్ ను ప్రసన్నం చేసుకోవాలి. అది అందరికీ సాధ్యం కాదు. మరి మూడు సినిమాల తర్వాత గేరు మార్చిన వైష్ణవ్ తేజ్ మాస్ హీరోగా జోరు పెంచుతాడేమో చూడాలి.

Related Posts