ఇప్పుడు సినీ అభిమానుల అందరి ఆలోచన ఆర్ఆర్ఆర్ గురించే. దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ ల కాంబినేషన్లో రూపొందించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ల కాంబినేషన్లో మూవీ అంటే.. అభిమానుల అంచనాలు తారాస్ధాయిలో ఉంటాయి. ఎవరి పాత్ర తక్కువ అయినా.. అభిమానులు తట్టుకోలేరు.
లేటెస్టుగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్స్ లో కూడా ఇద్దరు హీరోల అభిమానులు తమ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ముంబైలో జరిగిన ఈవెంట్ కు చెర్రీ హాజరు కాలేకపోయారు.. కానీ మిగతా మూడు ప్రెస్ మీట్స్ కి వచ్చారు. బెంగుళూరులో మీడియా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరోల ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రాంచరణ్ సమక్షంలో జై ఎన్టీఆర్ స్లోగన్స్ లో హంగామా చేశారు తారక్ అభిమానులు. అంతేకాదు తమ ఫేవరేట్ హీరోని ఓ పెద్ద గజామాలతో సత్కరించి కన్నడ సీమలో ఆయన క్రేజ్ ఏంటో తెలియజేయాలని ప్లాన్ చేశారు.
అయితే.. అదే స్టేజి మీద మరో హీరో చరణ్ కూడా ఉండటంతో.. తనొక్కడే పూల మాల వేసుకోవడం కరెక్ట్ కాదనుకొని తారక్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మరుసటి రోజు అనగా ఈరోజు హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రామ్ చరణ్ అభిమానులు రచ్చ చేయడం కనిపించింది. ఎన్టీఆర్, రాజమౌళిలతో కలిసి చరణ్ వస్తుండగా.. జై చరణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దూసుకు వచ్చారు. చరణ్ వారిని వారించే ప్రయత్నం చేశారు. చరణ్ ఫ్యాన్స్ కి పోటీగా ఎన్టీఆర్ ప్యాన్స్ సైతం పోటీగా నినదించారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజ్ తర్వాత అభిమానుల మధ్య వార్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది.