మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు మేకర్స్.
అయితే.. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్తలను ఆచార్య నిర్మాతలు ఖండించారు. ఈ సందర్భంగా ఆచార్య నిర్మాతలు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం.
ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందరి అంచనాలకు తగినట్లే ఆచార్య సినిమా ఉంటుంది అని ఆచార్య నిర్మాతలు తెలియచేశారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటించగా, చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. మరి.. ఆచార్య సినిమాతో చిరు, చరణ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.