నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. క్లారిటీ మాత్రం రావడం లేదు. బాలయ్యను ఎప్పుడు అడిగినా.. టైమ్ వచ్చినప్పుడు అన్ని విషయాలు ప్రకటిస్తానని చెప్పేవారు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ తొలి చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మూవీ చేయనున్నారని.. ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
ఆతర్వాత మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్ అని టాక్ గట్టిగా వినిపించింది. గత కొన్నాళ్ల నుంచి ఇలా వార్తలు రావడమే కానీ.. బాలయ్య నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ తొలి చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా బాలయ్యకు అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి.. మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యతల్ని అప్పగించారని వార్తలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం వుందని ప్రచారం జరుగుతుంది. అఖండ తర్వాత బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అనుకున్నారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేయనున్నారు. ఇది కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుచేత బోయపాటి మోక్షజ్ఞ తొలి చిత్రం చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.