యాదాద్రి ఆల‌యంలో బాల‌య్య ప్ర‌త్యేక పూజ‌లు

న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం అఖండ‌. ఈ సినిమా అంచ‌నాల‌కు మించి అద్భుత విజ‌యం సొంతం చేసుకుంది. మూడోవారంలో కూడా స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుండ‌డం విశేషం. ఇంత‌టి విజ‌యాన్ని అందించిన సంద‌ర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని అఖండ చిత్రబృందం సోమవారం ఉదయం దర్శించుకుంది. స్వామివారి ఆశీస్సులు తీసుకుంది.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ… అఖండ విజయవంతమైన సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం. భారతదేశంలోని ప్రతిఒక్కరూ స్వామివారిని దర్శించుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. యాదాద్రి ఆలయం ఒక చరిత్రాత్మకం. ఒక అద్భుతం. ఆలయ నిర్మాణంలో పని చేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నాను. ఆయన నా ఇష్ట దైవం. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను. హిందూ ధ‌ర్మాన్ని కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిలో ఉంది అని బాలయ్య అన్నారు.

Related Posts