ఆది సాయికుమార్ కొత్త పోలీస్ స్టోరీ…

పోలీస్ స్టోరీ.. ఈ మాట వినగానే అగ్న అగ్ని అంటూ ఊగిపోతూ థియేటర్స్ దద్దరిల్లిపోయేలా డైలాగ్స్ చెప్పిన సాయి కుమార్ గుర్తొస్తాడు. అసలు అలాంటి పోలీస్ స్టోరీని అంతకు ముందెప్పుడూ మన వెండితెర చూసిలేదు. అందుకే ఈ సినిమా ఆ రోజుల్లో హీరోగా తెలుగులో మార్కెట్ లేకపోయినా సాయికుమార్ కు బిగ్గట్ హిట్ గా నిలిచింది. పోలీస్ స్టోరీ హిట్ తో తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన తనయుడు ఆది సాయికుమార్ కూడా హీరోగా మారాడు. ఇతను ఒక్క హిట్ కోసం చాలాకాలంగా చకోర పక్షిలా చూస్తున్నాడు. విశేషం ఏంటంటే వస్తున్న సినిమాలన్నీ పోతున్నా.. అతనికి ఆఫర్స్ తగ్గలేదు.ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తీస్ మార్ ఖాన్ లా వస్తున్నాడు.
ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన తీస్ మార్ ఖాన్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఆది రెక్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. తండ్రి వేసిన పోలీస్ పాత్రకు పూర్తి భిన్నంగా.. కొంత గబ్బర్ సింగ్ నుంచి ఇన్ స్పైర్ అయిన క్యారెక్టరైజేషన్ కనిపిస్తోంది. ట్రైలర్ ఎప్పట్లానే ఆకట్టుకునేలానే కట్ చేశారు. పాయల్ అందాలు హైలెట్ గా కనిపించేలా కూడా ఉంది. ఆదితో పాటు సునిల్, పూర్ణ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సునిల్ అతనికి అన్నగానో లేక పూర్ణ అక్కగానో నటించారనపించేలా ఉందీ ట్రైలర్. మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకోసం కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ వంటి బలమైన విలన్స్ ను కూడా తీసుకున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నాగమ్ తిరుపతిరెడ్డి నిర్మాత. కళ్యాణ్‌ జీ గోగన దర్శకుడు. మరి ఈ నెల 19న విడుదల కాబోతోన్న ఈ తీస్ మార్ ఖాన్ తో అయినా ఆది ఓ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Related Posts