అమృత గాయని వాణీ జయరామ్

వాణి జయరామ్.. ఈ పేరు వినగానే మనసు మైమరచిపోయే గీతాలెన్నో మదిలో మెదులుతాయి. క్లాస్ నుంచి క్లాసికల్ సాంగ్స్ వరకూ, జానపదం నుంచి జాజ్ బీట్స్ వరకూ ఆ గాత్రంలో వింటే అమృతగీతాలవుతాయి. ఏ పాటైనా అలవోకగా.. తను తప్ప వేరెవరూ అలా పాడలేరేమో అనేంత హాయిగా పాడేయడమే ఆమె స్పెషాలిటీ. గాత్రం వింటే మనిషిని చూడాలనిపించేంతటి ఆ గానసరస్వతి వాణి జయరామ్. ఇండియన్ సినిమాపై తనదైన గాన మాధుర్యంతో అలరించిన ఆ అమృతగాత్రం మూగబోయింది.ఈ మధ్యే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఈ మధురగాయని 70యేళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు.


ఎన్నో కష్టమైన రాగాలన్నీ కూడా ఐదేళ్ళ వయసులోనే నేర్చుకుని బాలమేధావి అనిపించుకున్నారు వాణి జయరాం. ఆ ప్రతిభతోనే కర్నాటక సంగీతంలో పట్టు సాధించారు. చిన్నతనం నుండి హిందీ సినిమా పాటలు విని, వాటిమీద మక్కువ పెంచుకున్నారు. తను కూడా సినిమాల్లో పాటలు పాడాలని కలగన్నారు.. తర్వాత కాలంలో ఆ కలను నెరవేర్చుకున్నారు. సినిమా పాటకే మకుటమయ్యారు.


సినిమా సంగీతం మాత్రమే సంగీతం కాదు అనే అభిప్రాయం ఆమెది. లలిత సంగీతం, శాస్త్రీయ, ఉప శాస్త్రీయ, జానపదం… ఇవన్నీ సంగీతంలో భాగమే అనుకున్న వాణి, ఎన్నో రకాల సంగీతాల్లో స్పెషలైజ్‌ చేశారు. సినీ పరిశ్రమలోకి రాకముందే భజన్స్‌, గజల్స్‌ ప్రొగ్రాములు చేశారు.


వాణి తమిళనాడులో వేలూరులోని సంగీత కుటుంబంలో పుట్టారు. వాణి తల్లి కర్నూల్‌లో పుట్టి పెరగడం వల్ల ఆమెకు తెలుగు బాగా వచ్చు. జన్మతహ తమిళియన్ అయిన వాణీ అసలు పేరు కలై వాణి. జయరాంతో పెళ్ళయిన తర్వాత వాణీజయరాంగా మారారు. వీరి పెళ్ళి సికింద్రాబాద్‌లోనే జరిగింది. వాణీ జయరాం సికింద్రాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొన్నాళ్ళు పని చేశారు.


పెళ్లి తర్వాత ముంబయిలో స్థిరపడ్డ వాణీ జయరాం, భర్త ప్రోత్సాహంతో ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ దగ్గర హిందూస్తానీ క్లాసికల్‌, లైట్‌ క్లాసికల్‌ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 1970లో ప్లేబాక్‌ సింగర్‌గా మారారు. మొదటి చిత్రం హిందీ మూవీ ‘గుడ్డీ’. ఇందులోని ”బోల్‌రే పపీ హరా” పాట తోనే నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాకే తాన్‌సేన్‌ తోపాటు ఐదు అవార్డులు వచ్చాయి. ఈ ఒక్క పాటతోనే గొప్ప పేరు సంపాదించుకున్నారు.


కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అభిమానవంతులు‘ చిత్రంలోని ”ఎప్పటి వలె కాదురా నా స్వామి కాదురా” పాటతో వాణీజయరాం తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ”మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే”, ”దొరకునా ఇటువంటి సేవ” పాటలతో తెలుగులో బాగా పాపులరయ్యారు.


80ల్లో తెలుగులోకి వచ్చింది వాణిగానామృతం. కె. విశ్వనాథ్, కెవి మహదేవన్ వంటి మ్యూజికల్ కాంబినేషన్ లో పాడే అవకాశం ఆమెకు రావడం.. శ్రోతల అదృష్టం. తమిళ్ లో కె బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్‘ పేరు తెస్తే.. తెలుగులో విశ్వనాథ్ ‘శంకరాభరణం‘ పేరు తెచ్చింది.


ఒకరకంగా వాణీజయరామ్ కు తెలుగులో ఇంతటి కీర్తి రావడానికి కారణం విశ్వనాథ్ చిత్రాలే. శంకరాభరణం, స్వర్ణకమలం, స్వాతికిరణం, శృతిలయలు వంటి చిత్రాలు. స్వర్ణకమలంలో ఇళయరాజా సంగీతంలో బాలుతో కలిసి పాడిన ‘అందెలరవళిది‘ పాట సూపర్ హిట్. ‘శ్రుతిలయలు‘లోని ‘ఇన్ని రాశులయునికి‘ మరపురాని మరో గీతం.


కె విశ్వనాథ్ స్వాతికిరణం.. వాణీజయరామ్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రం. అసలు వాణీజయరాం అన్న పేరు వినిపించగానే ఆ వెనకే స్వాతికిరణమనో లేక తెలిమంచు కరిగింది అనో వినబడ్డం ఆనవాయితీ. ఆ స్థాయిలో ఈ చిత్రంలోని గీతాలాపనతో తెలుగువారి మదిని దోచిన మహాగాన సరస్వతి వాణి..


వాణీ జయరామ్ అన్ మాచ్డ్ నైటింగేల్ ఆప్ ఇండియా అంటారు సంగీత ప్రియులు. సోలోలూ సంగీత ప్రధాన గీతాలే కాదు…డ్యూయట్లూ చాలా స్పెషల్ గా పాడతారు వాణీ జయరామ్. సినిమా సంగీతానికీ శాస్త్రీయసంగీతానికీ ఉన్న లింకులు సమగ్రంగా తెల్సిన గాయని కావడంతో పాట తన గాత్రంలో వింత సొగసులు అద్దుకుంటుంది. ఎంతో సింపుల్ లైఫ్ గడిపే వాణి జయరాం గారు పాడిన అన్ని పాటలూ ప్రేక్షకులకు మహాఇష్టమే.

కానీ తనకు మాత్రం మొరటోడు చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే‘ పాటంటే బాగా ఇష్టం అని చెబుతారు. అలాగే ప్రేమలేఖలు చిత్రంలో సుశీలమ్మతో కలిసి పాడిన ఈ రోజు మంచి రోజు ఆమెకు ఇష్టమైన మరో పాట.తెలుగు, తమిళ, మళయాళీ, హిందీ, గుజరాతీ ఇలా పద్నాలుగు భాషల్లో ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన సంపూర్ణ భారతీయ గాయని వాణీ జయరామ్.

వాణీ సంగీత యానంలో ఎమ్.ఎస్.విశ్వనాథన్ పాత్ర చాలా ప్రత్యేకమైనది. వారిద్దరి కాంబినేషన్ లో తమిళ్ లోనే కాదు…తెలుగులోనూ అనేక అపురూప గీతాలు పురుడు పోసుకున్నాయి. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ అంటూ పూజ సినిమా కోసం ఓ అద్భుతమైన డ్యూయట్ గానం చేశారు వాణీ జయరామ్. నిజంగానే సంగీతంతో తనది జన్మజన్మల బంధంగానే కనిపిస్తుంది. తన పాట విన్న వారెవరైనా అదే మాటంటారు.
స్పాట్ : ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాది…పూజ…


”స్వాతికిరణం, పెళ్లి పుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, సీతాకోకచిలుక, ఇది కథకాదు, గుప్పెడు మనసు, శంకరాభరణం, కరుణామయుడు, మరోచరిత్ర, అంతులేని కథ” వంటి ఎన్నో చిత్రాల్లో తన గానంతో శ్రోతలను అలరించిన వాణీ జయరాం భౌతికంగా లేకపోయినా.. తన గాన మాధుర్యంతో ఎప్పటికీ మన మనసుల్లో నిలిచే ఉంటారు.

Related Posts