చిరంజీవితో సంక్రాంతి పోటీకి సిద్ధమవుతోన్న ప్రభాస్

మిగతా సీజన్లలో విడుదల చేసే కంటే.. తమ చిత్రాలను సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు అగ్ర కథానాయకులు. ఇక.. సంక్రాంతి బరిలో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఇప్పటివరకూ రెండు చిత్రాలను విడుదల చేశాడు. వాటిలో ఒకటి ‘వర్షం‘ కాగా.. మరొకటి ‘యోగి‘.

2004 సంక్రాంతికి విడుదలైన ‘వర్షం‘ ఘన విజయాన్ని సాధించి.. యంగ్ రెబెల్ స్టార్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఇక.. అదే ఏడాది సంక్రాంతి బరిలో ‘వర్షం‘తో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘అంజి‘ కూడా వచ్చింది. కానీ.. ‘వర్షం‘ ముందు ‘అంజి‘ నిలబడలేకపోయింది. కట్ చేస్తే.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత సంక్రాంతి బరిలో మెగాస్టార్ తో పోటీకి రెడీ అవుతున్నాడట రెబెల్ స్టార్ ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్‘ను సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరోవైపు ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి ‘విశ్వంభర‘ విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్‘ ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి ఈ మూవీని మళ్లీ రీస్టార్ట్ చేయనున్నారట. ఏకధాటిగా చిత్రీకరణ పూర్తిచేసి.. వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉందట నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. త్వరలోనే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.