ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా పుష్ప ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత గ్రాండ్గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపించింది.
ఇంతకీ పుష్ప ట్రైలర్ ఎలా ఉందంటే.. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ.. డైలాగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఆయన పుష్ప రాజ్ పాత్రకు ప్రాణం పోసారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ముఖ్యంగా సూపర్ పోలీస్ ఆఫీసర్తో డైలాగ్ ట్రైలర్కే హైలైట్. ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానీ.. డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ కానీ…. అన్నీ అద్భుతంగా కుదిరాయి.
ఈ ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అదిరింది. అంచనాలను రెట్టింపు చేసింది. ఇలా ట్రైలర్ రిలీజ్ చేశారో లేదో అలా యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఇప్పటి వరకు 6 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళుతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న పుష్ప మూవీ విడుదల కానుంది. మరి.. పుష్ప తో పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.