‘బుట్ట బొమ్మ’ చిత్రంలోని మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’

*అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట,అర్జున్ దాస్ నటిస్తున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రం నుండి మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’ విడుదల

*స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, మోహన భోగరాజు ఆలపించారు.

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మోహన భోగరాజు ఆలపించిన ‘పేరు లేని ఊరులోకి’ అనే మొదటి పాట ఈరోజు విడుదలైంది.

ఈ పాట మనకు మొబైల్ సంభాషణల ద్వారా ప్రధాన పాత్రధారులు క్రమంగా ఒకరితో ఒకరు ప్రేమలో పడే అందమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. సత్య అనే అమ్మాయి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి. ఆమె ఎక్కడ ఉన్నా సందడి వాతావరణం నెలకొంటుంది. ఆమె ఇంట్లో తన రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, ఆమె నిరంతరం మొబైల్ ఫోన్‌పై దృష్టి పెడుతుంది. ఆమె ఫోన్ లో ఆటో డ్రైవర్‌తో సంభాషిస్తుంది. అలా ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరై ప్రేమలో పడతారు.

పాటలోని ప్రశాంతమైన పరిసరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అవి మనల్ని పాత్రల యొక్క చిన్న ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాయి. ‘అంకె మారి లంకె వేసే కొత్త సంఖ్య వచ్చిందా.. నవ్వులన్నీ మూటగట్టి మోసుకొస్తూ ఉందా’, ‘అలుపు సలుపు అణువంత కూడా తల దాచుకోని చురుకంతా.. తన వెంటపడుతూ నిమిషాలు మెల్లగా కరిగే ప్రతి పూట’ అంటూ సనాపతి భరద్వాజ్ పాత్రుడు అందించిన సాహిత్యం పాట సందర్భానికి తగ్గట్లుగా అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉంది. గీత రచయిత ఏమంటున్నారంటే ‘ ఈ పాట రాయడానికి ప్రధాన ప్రేరణ, దర్శకులు రమేష్ గారు నన్ను నాకంటే ఎక్కువ నమ్మడమే. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు నా ధ్యన్యవాదాలు. స్వీకర్ అగస్తి గారి ట్యూన్స్ చాలా సహజంగా, క్యాచీగా ఉంటాయి,

రెండోసారి ఆయనతో కలిసి పని చెయ్యడం ఆనందంగా ఉంది.మోహనా భోగరాజు గారు చాలా చక్కగా పాడారు‘ అన్నారు.

స్వీకర్ అగస్తీ అందించిన ఆకర్షణీయమైన సంగీతం, మోహన భోగరాజు అద్భుతమైన స్వరం కలిసి పాటను ఎంతో అందంగా మలిచాయి.

ఈ సినిమాలో నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, మిర్చి కిరణ్, కంచరపాలెం కిషోర్, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్.నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘వరుడు కావలెను’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత గణేష్ కుమార్ రావూరి సంభాషణలు అందించారు.

Related Posts