ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడం.. థియేటర్లలో తనిఖీలు చేసి.. ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో సీజ్ చేస్తుండడం తెలిసిందే. దీంతో ఏపీలోని కొన్ని చోట్ల కొంత మంది థియేటర్ల ఓనర్స్ స్వచ్చందంగానే థియేటర్లను మూసేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన టిక్కెట్ల రేట్లతో థియేటర్లను నడపలేమని దాదాపు 30 థియేటర్లను మూసేశారు. దీంతో అక్కడ రిలీజ్ చేయాలి అనుకున్న కొన్ని సినిమాలు ఆగిపోతున్నాయి.
దీని గురించి పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరో నాని ఇటీవల ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు గురించి కామెంట్ చేయడం ఆయన మాటలు సంచలనం అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మరో యంగ్ హీరో నిఖిల్ సిద్థార్థ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ నిఖల్ ఏమన్నాడంటే.. వివిధ టైర్ కంపార్ట్మెంట్ల ఆధారంగా ట్రైన్ టికెట్ రేట్లను ఎలా నిర్ణయిస్తున్నారో అలాగే థియేటర్స్ టికెట్ రేట్లను నిర్ణయించాల్సిదిగా కోరాడు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయల టిక్కెట్ సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్తో బాల్కనీ /ప్రీమియం విభాగాన్ని అనుమతించమని అధికారులకు నిఖిల్ ట్వీట్ ద్వారా అభ్యర్థనను తెలిపాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థియేటర్లు నాకు దేవాలయాలు లాంటివి. ప్రజలకు ఎప్పుడూ ఆనందాన్ని అందిస్తుంటాయి. అలాంటి థియేటర్లు మూతపడడం చాలా బాధాకరం అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషం. ఈ విషయంలో వారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే థియేటర్లు తిరిగి తమ వైభవాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుందని ఆశిస్తున్నాను అని ట్వీట్లో నిఖిల్ పేర్కొన్నాడు. మరి కొంత మంది ముందుకు వచ్చి తన వాయిస్ వినిపిస్తారేమో చూడాలి.