ప్రేమ ట్విస్టులతో “అమ్మాయిలు అర్థంకారు”

“1940లో ఒక గ్రామం”,”‘కమలతో నా ప్రయాణం”, “జాతీయ రహదారి” వంటి అవార్డు సినిమాల దర్శకుడు
నరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా “అమ్మాయిలు అర్థంకారు”. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య. ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు.


శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాతలు నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.


.అతిధులగా పాల్గొన్న సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “నరసింహ నంది తన అభిరుచికి అనుగుణంగా సినిమాలను తీసుకుని పోతున్నారు. అయితే డబ్బు తెచ్చిపెట్టే కమర్షియల్ సినిమాలను ఆయన రూపొందించి ఉంటే, ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరి ఉండేవారు. ఆ కోవలో ఈ సినిమా ఆయనకు పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను” అని అన్నారు. .


టి.ప్రసన్నకుమార్, బసిరెడ్డి మాట్లాడుతూ,“డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది. కానీ తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ఆలోచన పరిశ్రమలో అందరికీ కలగాలి. నరసింహ నంది తన తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సాధించారు. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని అవార్డు సినిమాలను తీశారు. అలాంటి దర్శకులను ప్రోత్సహించాల్చిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు.


దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, సమకాలీన వాస్తవిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని మధ్యతరగతి జీవితాలలో జరిగే నాలుగు ప్రేమ జంట కథలతో ఈ సినిమాను తెరకెక్కించాను. మధ్య తరగతి జీవితాలలో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దానివల్ల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో అన్న అంశాన్ని ఇందులో చర్చించాం. ఓ రచయిత అన్నట్లు మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో…అలాగే మధ్యతరగతి జీవితాలలో అన్ని ట్విస్టులు ఉంటాయన్న కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈషే అబ్బూరి ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు.


నిర్మాతలలో ఒకరైన కర్ర వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, “చిత్తూరు, తిరుపతి ప్రాంతాల యాసను నేపధ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది” అని చెప్పారు.హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ, చిత్తూరు యాసను కస్టపడి నేర్చుకుని మరీ ఈ సినిమాలో నటించామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు బాలాదిత్య, వి.ఎన్.ఆదిత్య, వీరశంకర్ తదితరులు పాల్గొని, ప్రసంగించారు.

ఈ సినిమాలోని ఇతర పాత్రలలో కొలకలూరి రవిబాబు, మురళి (ప్రజాశక్తి), గగన్, వీరభద్రం, శంకర్ మహంతి, మల్లేష్, మండల విజయభాస్కర్, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం. సాంకేతిక బృందం: ఛాయాగ్రహణం: ఈషే అబ్బూరి, సంగీతం: నరసింహ నంది, నేఫధ్య సంగీతం: రోణి ఆడమ్స్, పాటలు: మౌన శ్రీ మల్లిక్, కమల్ విహస్, ప్రణవం, సహ నిర్మాతలు: అల్లం వెంకటరావు చౌదరి, షేక్ రహమ్ తుల్లా, నిర్మాతలు: నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య, రచన, దర్శకత్వం: నరసింహ నంది.

Related Posts