‘భీమ్లా నాయ‌క్’ నుంచి ‘అడవి తల్లి’ సాంగ్ వ‌చ్చేసింది

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి యంగ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీనికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందిస్తుండ‌డం విశేషం. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు పాట‌లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ రోజు అడవి తల్లి మాట… అంటూ సాగే ఈ సినిమాకి సంబంధించిన‌ నాలుగో పాటని విడుదల చేశారు. ఇక ఈ పాట విష‌యానికి వ‌స్తే.. కిందున్న మడుసులలా.. కోపాలు తెమలవు.. పైనున్న సామేమే కిమ్మని పలకడు.. అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. అడవి తల్లి మాట పాటకు సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు.

ఈ పాట‌ను జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ మరియు సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అహం, ఆత్మాభిమానం నేపథ్యంలో భీమ్లా నాయక్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన అడవి తల్లి మాట పాట ఈ సినిమా సారాంశాన్ని వివరిస్తోంది. రోజురోజుకు భీమ్లా నాయ‌క్ పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భీమ్లా నాయ‌క్ ఏరేంజ్ స‌క్స‌స్ సాధిస్తారో చూడాలి.

Related Posts