టాలీవుడ్ 2024.. ఫస్ట్ హాఫ్ రిపోర్ట్

ఈ ఏడాది అప్పుడే క్యాలెండర్ లో ఆరు నెలలు గిర్రున తిరిగాయి. టాలీవుడ్-2024 లో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. మరి.. ఈ ఆరు నెలల్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ కి ఎలాంటి ఫలితాల్ని అందించాయి. ఏఏ చిత్రాలు విజయాలు సాధించాయి. ఏ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి వంటి విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.

జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలలో సంక్రాంతి సినిమాలనే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ సినిమాలు విడుదలయ్యాయి. మహేష్ ‘గుంటూరు కారం’ భారీ అంచనాల మధ్య వస్తే.. డివోషనల్ స్టోరీతో తెరకెక్కిన ‘హనుమాన్’ అండర్ డాగ్ గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘హనుమాన్’ భారీ విజయాన్ని సాధింగా.. ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలమైంది.

సంక్రాంతి బరిలో నిలిచిన మరో రెండు చిత్రాలు వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’. సంక్రాంతి సీజన్లలో హాట్ ఫేవరెట్ గా దిగే ఈ ఇద్దరు స్టార్లలో వెంకీకి ‘సైంధవ్’ తీవ్ర నిరాశను మిగిలిస్తే.. నాగార్జునకు ‘నా సామిరంగ’ రూపంలో పాజిటివ్ రిజల్ట్ దక్కింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సైంధవ్’ని ఆడియన్స్ ఏమాత్రం ఆదరించలేదు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా.. సంక్రాంతి బరిలో అసలు సిసలు సినిమాగా వచ్చిన ‘నా సామిరంగ’కి అదిరిపోయే ఓపెనింగ్స్ అందించారు అక్కినేని ఫ్యాన్స్.

ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’కి మంచి ఆదరణ దక్కింది. సుహాస్, శివానీ జంటగా నటించిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చి హిట్ కొట్టింది. ఆద్యంతం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ రొమాంటిక్ రివెంజ్ డ్రామాకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఫిబ్రవరి రెండో వారం సినిమాల విషయానికొస్తే.. భారీ అంచనాలతో విడుదలైన రవితేజ ‘ఈగల్’ డిజాస్టర్ గా మిగిలింది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ టెక్నికల్ గా హై స్టాండార్డ్స్ లో ఉన్న కంటెంట్ వీక్ గా ఉండడంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.

ఫిబ్రవరి రెండో వారంలోనే విడుదలైన పొలిటికల్ బయోపిక్ ‘యాత్ర 2’ కూడా నిరాశపరిచిందని చెప్పొచ్చు. ‘జైలర్’ వంటి హిట్ తర్వాత రజనీకాంత్ నుంచి వచ్చిన ‘లాల్ సలామ్’ అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయింది. మలయాళం అనువాద మూవీ ‘భ్రమయుగం’ విమర్శకులను మెప్పించింది కానీ.. కాసులు కురిపించలేకపోయింది. ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని అందించిన చిత్రమంటే ‘ఊరు పేరు భైరవకోన’ గురించి చెప్పాలి. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన సందీప్ కిషన్ కి ఈ సినిమా మంచి ఫలితాన్ని అందించింది.

మార్చి సినిమాల విషయానికొస్తే.. ఫస్ట్ వీక్ లో వచ్చింది వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాకోసం నెలల తరబడి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేశాడు మెగా ప్రిన్స్. అయితే.. ఈ ఏరియల్ యాక్షన్ కంటెంట్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో సినిమా ఫలితం తారుమారైంది. రెండో వారంలో ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భీమా, గామి’ సినిమాలలో విశ్వక్ సేన్ ‘గామి’కి మంచి అప్లాజ్ వచ్చింది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ‘గామి’కి చాలా త్వరగానే బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే.. మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘భీమా’ మరో రొటీన్ కమర్షియల్ మూవీగా మిగిలిపోయింది.

మార్చి నెలలో విడుదలైన చిత్రాలలో ‘రజాకార్’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కితే.. మార్చి 22న విడుదలైన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘ఓం భీమ్ బుష్’ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ‘ఓం భీమ్ బుష్’కి ప్రేక్షకుల ఆదరణ దక్కింది. మార్చి ఎండింగ్ లో రిలీజైన ‘టిల్లు స్క్వేర్’ బాక్సాపీస్ ను ఊపేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఏప్రిల్ సినిమాల విషయానికొస్తే.. ఈ నెలలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, అంజలి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు బ్యానర్ లో రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్’కి మంచి ఓపెనింగ్స్ దక్కినా.. లాంగ్ రన్ లో అంచనాలు అందుకోలేకపోయింది. ‘గీతాంజలి’కి సీక్వెల్ గా వచ్చిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ప్రేక్షకుల్ని నవ్వించడంలోనూ, భయపెట్టడంలోనూ అంతగా ప్రభావం చూపించలేదు.

మే మాసంలో వేసవి కానుకగా పెద్ద సినిమాలు ఏవీ రాలేదు. ఈ నెలంతా చిన్న చిత్రాలదే హవా. వీటిలో ముందుగా వచ్చింది అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఆ తర్వాత సత్యదేవ్ ‘కృష్ణమ్మ’, నారా రోహిత్ ‘ప్రతినిధి 2’, గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’, ఆశిష్ ‘లవ్ మీ’ , కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గమ్ గమ్ గణేశా’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలున్నాయి. వీటిలో కార్తికేయ ‘భజే వాయు వేగం’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించాయి.

జూన్ నెలలో నవదీప్ ‘లవ్ మౌళి’, శర్వానంద్ ‘మనమే’, కాజల్ ‘సత్యభామ’, సుధీర్ బాబు ‘హరోం హర’ వంటి చిన్న సినిమాలు వచ్చినా.. ఇవేమీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే.. వీటిలో శర్వానంద్ ‘మనమే’కి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇక.. జూన్ చివరిలో వచ్చిన ‘కల్కి 2898 ఎ.డి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సోమవారం నాటికి ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి.

మొత్తంగా.. 2024 మొదటి అర్థభాగం టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాల్ని అందించిందని చెప్పొచ్చు. ఎన్నో అంచనాలతో వచ్చిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నిరాశపరిస్తే.. పెద్దగా అంచనాలు లేని ‘హనుమాన్’ అదిరిపోయే విజయాన్నందించింది. ఇక.. మధ్యలో సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవ కోన’, విశ్వక్ సేన్ ‘గామి’, శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇక.. చివరిలో వచ్చిన ‘కల్కి’ భారీ విజయాన్ని సాధించే దిశగా దూసుకెళ్తుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో రవితేజ నటించిన ‘ఈగల్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, గోపీచంద్ ‘భీమా’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ తీవ్రంగా నిరాశపరిచాయి.

Related Posts