ప‌రంప‌ర వెబ్ సిరీస్ – రివ్యూ

చ‌రిత్ర సృష్టించిన‌ బాహుబలి సినిమాతో పాటు వేదం, మ‌ర్యాద రామ‌న్న త‌దిత‌ర చిత్రాలు, అలాగే ప‌లు టీవీ సీరియ‌ల్స్ నిర్మించిన ఆర్కా మీడియా వ‌ర్క్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ప్ర‌వేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని పరంపర అనే వెబ్ సీరిస్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌రి.. వెబ్ సిరీస్ ఎలా ఉంది..? ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో..? ఇప్ప‌డు తెలుసుకుందాం.

క‌థ

విశాఖ జిల్లాకు చెందిన వీరనాయుడు (మురళీమోహన్‌) ప్రజల మనిషి. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నాను అంటూ ముందుంటాడు. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని భూమిని కూడా పేద ప్రజలకు దానం చేసిన వ్యక్తి. ఆయన కొడుకులు మోహన రావు (జగపతిబాబు), నాగేంద్ర నాయుడు (శరత్‌ కుమార్‌). నిజానికి మోహ‌న‌రావు అనాథ. అయితే.. వీరనాయుడు మోహ‌న‌రావును దత్తతు తీసుకుంటాడు. సొంత కొడుకులా. పెద్ద కొడుకులా చూసుకుంటాడు. అతన్ని తన రాజకీయ వారసుడిని చేయాలి వీరనాయుడు భావిస్తాడు కానీ అంతలోనే హత్యకు గురవుతాడు.

తమ్ముడు నాగేంద్ర నాయుడు అభిప్రాయానికి విలువ ఇచ్చి మోహనరావు కుటుంబ వ్యవహారాలకే పరిమితమవుతాడు. దాంతో రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు మొత్తం నాగేంద్రనాయుడు చేతిలోకి వెళ్ళిపోతాయి. సెంటిమెంట్‌తో తన తండ్రిని బాబాయ్‌ పక్కన పెట్టేయడాన్ని మోహనరావు కొడుకు గోపీ (నవీనచంద్ర) తట్టుకోలేకపోతాడు. బాబాయ్‌ కొడుకు సురేశ్‌ (ఇషాన్‌) సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని తెలిసి అతన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అనుకుంటాడు. ఒకే ఇంటిలో ఉంటూ మోహ‌న‌రావు, నాగేంద్ర‌నాయుడు ప్రత్యర్థుల్లా ఉంటుంటారు. మోహనరావు, నాగేంద్రనాయుడు.. వారి పిల్లలు గోపీ, సురేశ్‌ మధ్య ఏర్పడిన వైరం వారి జీవితాలను ఎలా మ‌లుపు తిప్పింది.? చివ‌రికి ఏమైంది అనేదే ప‌రంప‌ర క‌థ‌.

ప్లస్ పాయింట్స్
ప్ర‌ముఖ న‌టులు న‌టించ‌డం
క‌థ‌, క‌థ‌నం
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్
నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎక్కువ
బలహీనమైన సన్నివేశాలు
డ్రామా ఓవ‌ర్ గా అనిపించ‌డం.
పాట‌లు

విశ్లేష‌ణ

అన్నదమ్ముల మధ్య ఉండే అధికార, ఆధిపత్య పోరు నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలానే రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత రక్త సంబంధాలను సైతం పట్టించుకోకుండా అడ్డగోలుగా ఎదగాలని చూసే వ్యక్తుల జీవితాలూ సినిమాలు వచ్చాయి. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ను మొదటి సీజన్‌ లో విడుదల చేశారు. ప్రారంభం అనే మొదటి ఎపిసోడ్ లో వీరనాయుడు హత్య, తదనంతరం రాజకీయ, వ్యాపార ఆధిపత్యం సొంత కొడుకు నాగేంద్ర నాయుడు చేతిలోకి వెళ్ళడంతో మొదలవుతుంది. ఇదంతా చూస్తుంటే.. ఓల్డ్ స్కూల్ డ్రామాలా అనిపిస్తుంటుంది.

ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ఇక చివరి ఎపిసోడ్ వలయం గోపీని సొంత తల్లిదండ్రులు, ప్రేమించిన అమ్మాయి సైతం వ్యతిరేకించడంతో ముగిసింది. నిజానికి అసలు పరంపరకు ఇది మొదలు. అయితే… 30 నిమిషాల నుండి దాదాపుగా గంట నిడివి మధ్య ఉన్న ఈ ఏడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత… ఈ మాత్రం కథ చెప్పడానికి ఇంత టైమ్ అవ‌స‌ర‌మా..? అనిపిస్తోంది. మురళీమోహన్, జగపతిబాబు, శరత్‌ కుమార్‌, నవీన్ చంద్ర, ఇషాన్‌, ఆకాంక్ష సింగ్‌, నైనా గంగూలీ, ఆమని, కస్తూరి వంటి తారలు నటించడం ప్లస్ అయ్యింది.

జగపతిబాబును ఈ తరహా పాత్రల్లో మనం గతంలో చూశాం. అయితే.. ఇటు శరత్ కుమార్, అటు నవీన్ చంద్ర దీనిని తమ భుజాలకెత్తుకుని నడిపారు. ఆర్కా మీడియా హౌస్ నుండి వచ్చిన వెబ్ సీరిస్ కాబట్టి నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్ గా తీశారు. నరేశ్‌ కుమరన్ నేపథ్య సంగీతం బాగుంది కానీ మధ్యలో వచ్చే ఒకటి రెండు పాటలు నిజానికి అవసరమే లేదు. అవన్నీ అనవసరపు హంగులు, కథాగమనానికి అడ్డం వచ్చేవే. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. టైమ్ పాస్ అవ్వాల‌నుకుంటే చూడ‌చ్చు.

రేటింగ్ 2/5

Related Posts